ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో వెస్టిండీస్ ఆటగాళ్లు అత్యంత విజయవంతమైయ్యారు. క్రిస్ గేల్, ఆండ్రీ రస్సెల్, కిరణ్ పోల్లార్డ్, సునీల్ నరైన్, డ్వేన్ బ్రేవోలు ఐపీఎల్ మొదటి నుంచి ఇప్పటివరకు పరుగుల వరద పారిస్తున్నారు. ఇక వెస్టిండీస్ ఆటగాళ్ల అనంతరం ఆస్ట్రేలియా ఆటగాళ్లు సత్తా చాటారు. మరి హిట్టర్ బ్యాట్స్మన్లు ఐపీఎల్ నుండి అర్ధాంతరంగా వెళ్ళిపోతే అభిమానులకు షాకే. ఇలాంటి ఘటనే త్వరలో చోటుచేసుకోనుంది.
ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్లతో పాటు ప్రపంచకప్ జట్టుకు ఎంపికైన ఆస్ట్రేలియా ఆటగాళ్లు అందరూ ఏప్రిల్ నెల చివరలో స్వదేశానికి వెళ్లనున్నారు. మే 30 ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో.. మే 2 నుంచి స్వదేశంలో జరిగే జట్టు శిక్షణ శిబిరంలో అందరూ పాల్గొనాలి. దీంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు అందరూ ఐపీఎల్ చివరి ఫేస్ కు అందుబాటులో ఉండరు.
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు వార్నర్, రాజస్థాన్ రాయల్స్ జట్టుకు స్మిత్ ఆడుతున్న విషయం తెలిసిందే. మే 2 కంటే ముందు సన్రైజర్స్ ఆడే 5 లీగ్ మ్యాచ్లకే వార్నర్ అందుబాటులో ఉంటాడు. మరోవైపు స్మిత్ ఏప్రిల్ 30న బెంగళూరుతో చివరి మ్యాచ్ ఆడనున్నాడు. ఇక బెంగళూరు జట్టుకు ఆడుతున్న స్టొయినిస్, ముంబైకి ఆడుతున్న బెహ్రెన్డార్ఫ్ కూడా ఐపీఎల్ను వీడనున్నారు. ముంబైకి ప్రధాన పేసర్ అయిన బెహ్రెన్డార్ఫ్.. సన్రైజర్స్కు ప్రధాన బ్యాట్స్మన్ అయిన వార్నర్ అందుబాటులో లేకపోవడం ఆ జట్లకు పెద్ద ఎదురుదెబ్బే. అయితే స్మిత్, స్టొయినిస్లు ఇంతవరకు అంతగా ఆకట్టుకోలేదు.