
హైదరాబాద్: బాల్ టాంపరింగ్ వివాదంలో తన సహచర ఆటగాడిని ప్రోత్సహించిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2018 సీజన్లో ఆడేందుకు అనుమతి ఇవ్వొద్దని భారత మాజీ క్రికెటర్ అతుల్ వాసన్ అభిప్రాయపడ్డాడు.
తాజాగా మిడ్ డే పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో అతుల్ వాసన్ మాట్లాడుతూ 'బాల్ టాంపరింగ్పై లంచ్ విరామంలో చర్చించినట్లు స్మిత్ అంగీకరించాడు. ఒక జట్టుకు నాయకత్వ బాధ్యతలు వహిస్తున్న ఆటగాడు ఇలాంటి ఆలోచనలు చేయడమే పెద్ద తప్పు. అందుకే అతన్ని ఐపీఎల్లో ఆడేందుకు అనుమతి ఇవ్వొద్దు' అని అన్నాడు.
'ఒక మ్యాచ్ నిషేధంతోనే సరిపెట్టకుండా మరికొన్ని మ్యాచ్ల నిషేధానికీ గురి చేయాలి. అప్పుడే తాను చేసిన తప్పు ఏమిటన్నది స్మిత్కు తెలిసొస్తుంది. అలాగే వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్నూ ఐపీఎల్కి అనుమతించొద్దు. ఈ మాటలు ఆయా ఫ్రాంఛైజీలకు కాస్త ఇబ్బందికరంగా ఉండొచ్చు. కానీ, ఆటగాళ్ల కంటే గేమ్ ముఖ్యం. అందుకే ఇలా మాట్లాడుతున్నా' అని అన్నాడు.
కేప్టౌన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా బాల్ టాంపరింగ్కు పాల్పడిన సంగతి తెలిసిందే. దీంతో కెప్టెన్ స్టీవ్స్మిత్పై ఐసీసీ ఒక మ్యాచ్ నిషేధం, మ్యాచ్ ఫీజులో వంద శాతం కోత విధించిన సంగతి తెలిసిందే. టాంపరింగ్కు పాల్పడిన బాన్క్రాఫ్ట్ మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత, మూడు డీమెరిట్ పాయింట్లను అతడి ఖాతాలో చేర్చింది.
మరోవైపు ఈ బాల్ టాంపరింగ్ వివాదంపై క్రికెట్ ఆస్ట్రేలియా విచారణకు ఆదేశించింది. క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) నిబంధనల ప్రకారం మోసానికి పాల్పడిన క్రికెటర్లపై జీవితకాల నిషేధం విధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన క్రికెట్ అభిమానులు సైతం వీళ్లిద్దరిపై జీవితకాల నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు.
దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉంది. రెండేళ్ల విరామం తర్వాత ఇండియన్ ప్రీమియిర్ లీగ్ (ఐపీఎల్) 2018 సీజన్లో పునరాగమనం చేస్తోన్న రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కూడా ఇది తీవ్ర ఇబ్బందిగా మారింది. దీంతో సోమవారం ఆ జట్టుకు కొత్త కెప్టెన్గా అజ్యింకె రహానేను నియమిస్తూ ప్రాంఛైజీ నిర్ణయం తీసుకుంది.
'ఈ ఏడాది ఐపీఎల్ సీజన్కు రహానె కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. కేప్టౌన్లో చోటు చేసుకున్న ఘటన యావత్తు క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇటు బీసీసీఐ.. అటు స్మిత్తో ఎప్పటికప్పుడు చర్చలు జరిపాం. ఈ క్రమంలోనే అతడు నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటానని చెప్పాడు. స్మిత్ నిర్ణయానికి అంగీకరించాం. ఆ స్థానంలో రహానేను ఎంపిక చేశాం' అని రాజస్థాన్ యాజమాన్యం తెలిపింది.
'రాయల్స్ కుటుంబంలో రహానే ఎప్పటి నుంచో సభ్యుడు. రహానే సమర్థవంతగా జట్టును నడిపిస్తాడన్న నమ్మకం మాకు ఉంది' అని పేర్కొంది. స్టీవ్ స్మిత్ పై ఐసీసీ తీసుకునే చర్యల ఆధారంగా ఐపీఎల్లో అతడిని ఆడనివ్వాలా వద్దా? అన్నదానిపై రాజస్థాన్ ఫ్రాంచైజీ త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.