స్మిత్, వార్నర్ను అట్టిపెట్టుకున్న ప్రాంఛైజీలు
పంజాబ్ జట్టు యువరాజ్ సింగ్ను వదులుకోగా.. ఢిల్లీ డేర్ డెవిల్స్ ప్రాంఛైజీ గౌతమ్ గంభీర్ను వేలానికి విడుదల చేసింది. ఇక, బాల్ టాంపరింగ్ కారణంగా ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన ఆసీస్ క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్లను ఆయా ఫ్రాంఛైజీలు అట్టిపెట్టుకోవడం విశేషం. ఈ ఇద్దరినీ వేలంలోకి విడుదల చేయకుండా టీమ్లోనే కొనసాగిస్తున్నట్లు ఫ్రాంఛైజీలు ప్రకటించాయి.
ఏడాది పాటు నిషేధం విధించిన క్రికెట్ ఆస్ట్రేలియా
ఈ ఏడాది మొదట్లో సఫారీ పర్యటనలో భాగంగా కేప్టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో బాల్ టాంపరింగ్ ఉదంతం కారణంగా ఈ ఇద్దరిపై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించింది. దీంతో గతేడాది ఐపీఎల్ సీజన్కు వీరిద్దరూ దూరమయ్యారు. వీరిపై విధించిన నిషేధం ఐపీఎల్ 2019 సీజన్ ఆరంభమయ్యే రోజునే తొలగిపోనుంది.
2019లో ఆయా జట్ల తరఫున బరిలో దిగనున్న స్మిత్, వార్నర్
ఈ నేపథ్యంలో వీరిద్దరూ ఐపీఎల్ 2019లో ఆయా జట్ల తరఫున బరిలో దిగనున్నారు. స్టీవ్ స్మిత్ రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహిస్తుండగా, డేవిడ్ వార్నర్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కొనసాగుతున్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా వీరిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ, ఐపీఎల్లో తిరిగి ఆడటంపై ఐపీఎల్ నిర్వాహకులు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంటుంది.
మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్ కప్
కాగా, వచ్చే ఏడాది మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఐపీఎల్ 2019 సీజన్ను ముందుకు జరిపిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2019 సీజన్ను వచ్చే ఏడాది మార్చి 29 నుంచి మే 19 మధ్య నిర్వహించాలని బీసీసీఐ షెడ్యూల్ కూడా ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది.