హైదరాబాద్: ఆస్ట్రేలియా టెస్టు క్రికెటర్ స్టీవ్ ఓకీఫ్ మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. వివరాల్లోకి వెళితే సిడ్నీలో జరిగిన ఓ క్రికెట్ కార్యక్రమంలో పాల్గొన్న ఓకీఫ్ అతిగా మద్యం సేవించి విచక్షణా రహితంగా ప్రవర్తించాడు.
అతడి ప్రవర్తనకు గాను 20 వేల ఆస్ట్రేలియా డాలర్లను జరిమానాగా విధించారు అక్కడి పోలీసులు. అంతేకాదు అతడిని కౌన్సిలింగ్కు కూడా వెళ్లాల్సిందిగా పోలీసులు సూచించారు. ఇటీవల భారత్తో ముగిసిన నాలుగు టెస్టుల సిరిస్లో ఓకీఫ్ అద్భుత ప్రదర్శన చేశాడు.
గతేడాది కూడా ఓకీఫ్ సిడ్నీలోనే ఓ హోటల్లో మద్యం సేవించి రచ్చ రచ్చ చేశాడు. ఇలాంటి చర్యలను క్రికెట్ ఆస్ట్రేలియా ఉపేక్షించబోదని జనరల్ మేనేజర్ పాట్ హోవర్డ్ తెలిపారు. ఓకీఫ్ తీరుతో తాము తీవ్ర నిరాశకు గురైనట్లు ఆయన చెప్పుకొచ్చారు.
ఈ ఘటన అనంతరం ఓకీఫ్ మాట్లాడుతూ మద్యం మత్తులో తాను వ్యవహరించినందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. తనకు విధించిన జరిమానా చెల్లించడంతో పాటు కౌన్సిలింగ్కు వెళ్లేందుకు అంగీకరించాడు. 2014లో టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేసిన ఓకీఫ్ 8 టెస్టుల్లో 33 వికెట్లు తీశాడు.