
అందరి మనసులు గెలుచుకో
మహమ్మద్ సిరాజ్ అన్న మాటలతో కదిలిపోయిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అతడి వ్యక్తిత్వాన్ని కొనియాడితే.. గడ్డు పరిస్థితులే నీలోని అత్యుత్తమ ఆటగాడిని బయటకు తెస్తాయి అని విరాట్ కోహ్లీ భరోసానిచ్చాడు. మరోవైపు సిరాజ్తో అతడి తల్లి మాట్లాడుతూ భావోద్వేగం చెందారు. 'నువ్వు దేశానికి ఆడాలనేది నీ తండ్రి కల. దాన్ని నిర్వర్తించడమే నీ ముందున్న కర్తవ్యం. చక్కటి ప్రదర్శనతో అందరి మనసులు గెలుచుకో' అని తన తల్లి అన్నట్లు సిరాజ్ తెలిపాడు. ఆస్ట్రేలియాలోనే ఉండి.. నాన్న కలను నెరవేర్చు అని తన తల్లి చెప్పినట్టు బీసీసీఐ.టీవీతో సిరాజ్ మాట్లాడుతూ అన్నాడు.

కోహ్లీ మాటలే స్ఫూర్తి
కెప్టెన్ విరాట్ కోహ్లీ ధైర్యం చెప్పాడని మహమ్మద్ సిరాజ్ అన్నాడు. 'నాన్న మరణం నాకు తీరని లోటు. తీవ్ర బాధలో ఉన్న నన్ను విరాట్ భాయ్ ఓదార్చాడు. "సోదరా.. ఆందోళన వద్దు. ధైర్యంగా ఉండు. నువ్వు భారత్కు ఆడాలన్నది మీ నాన్న కోరిక. ఆ పని చెయ్. అనవసరంగా ఒత్తిడి పెంచుకోకు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దృఢంగా ఉంటే నువ్వు మరింతగా రాటుదేలుతావు" అని కోహ్లీ ధైర్యం చెప్పాడు. కెప్టెన్ మాటలు నాలో స్ఫూర్తి నింపాయి' అని సిరాజ్ తెలిపాడు. 2007లో ఢిల్లీ తరఫున రంజీట్రోఫీ మ్యాచ్ ఆడుతున్నప్పుడు కోహ్లీ తన తండ్రిని కోల్పోయాడు. అయినా తర్వాతి రోజు మైదానంలో అడుగుపెట్టిన విరాట్ 97 పరుగులు సాధించాడు.

కంగారూల వికెట్లు పడగొట్టేందుకు సిద్ధం
'మేరా బేటా దేశ్కా నామ్ రోషన్ కరేగా' (నా కొడుకు దేశాన్ని గర్వించేలా చేస్తాడు) అని తరచూ చెప్పే తండ్రి మాటలను మనసులో బలంగా ముద్రించుకున్న మహమ్మద్ సిరాజ్.. తండ్రిని కడసారి చూడటం కంటే జట్టుతో ఉండి మంచి ప్రదర్శన చేయడమే తన కర్తవ్యమని నిర్ణయించుకున్నాడు. ఇక కెప్టెన్ ఇచ్చిన స్పూర్తితో కంగారూల వికెట్లు పడగొట్టేందుకు సిద్ధమయ్యాడు. ఆటో రిక్షా నడుపుతూ రెక్కలు ముక్కలు చేసుకొని తనను అంతర్జాతీయ స్థాయికి చేర్చిన తండ్రికి విజయాల రూపంలో నివాళి అర్పించాలని ప్రాక్టీస్పై మనసుపెట్టాడు.


Click it and Unblock the Notifications












