
హైదరాబాద్: తన సొంత రికార్డును తనే బ్రేక్ చేసుకోవడమే కాక, ఆస్ట్రేలియన్ క్రికెటర్ డాన్ బ్రాడ్మాన్ అరుదైన రికార్డును సైతం కోహ్లి దాటేశాడు. ప్రపంచ క్రికెట్లో ఇప్పటికే ఎన్నో రికార్డులను నెలకొల్పిన టీమిండియా కెప్టన్ విరాట్ కోహ్లి... శ్రీలంకతో మూడో టెస్టులో డబుల్ సెంచరీ సాధించడం ద్వారా ఆరో డబుల్ సెంచరీని సాధించిన ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు.
బ్రాడ్మాన్ రికార్డ్ బ్రేక్:
అత్యంత తక్కువ సమయంలో(రోజులు) ఆరు డబుల్ సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. దాంతో తొలి ఆరు ద్విశతకాలు సాధించే క్రమంలో బ్రాడ్మాన్ రికార్డును విరాట్ కోహ్లీ అధిగమించాడు. అంతేగాక తన టెస్ట్ మ్యాచ్లో ఇండియన్ కెప్టెన్లలో (235)తో టాప్ స్కోరర్గా ఉన్న కోహ్లి తన రికార్డును తానే బ్రేక్ చేశాడు.
తన కెరీర్లో విరాట్ ఆరు డబుల్ సెంచరీలను సాధించడానికి 499 రోజులు పడితే.. డాన్ బ్రాడ్మ్యాన్కు తొలి ఆరు ద్విశతకాలు సాధించడానికి 581 రోజులు పట్టింది. 2016, జూలైలో విండీస్పై తొలిసారి డబుల్ సెంచరీని కోహ్లి సాధించాడు. అదే ఏడాది మూడు డబుల్ సెంచరీలు సాధించిన కోహ్లి.. 2017లో ఇప్పటివరకూ మరో మూడు డబుల్ సెంచరీలు నమోదు చేశాడు.
ఇదిలా ఉంచితే, వరుస ఇన్నింగ్స్ల్లో రెండు డబుల్ సెంచరీలు బాదిన రెండో భారత క్రికెటర్గా కూడా కోహ్లి గుర్తింపు పొందాడు. అంతకుముందు వినోద్ కాంబ్లి మాత్రమే వరుస ఇన్నింగ్స్ల్లో డబుల్ సెంచరీలు చేసిన భారత ఆటగాడు కాగా, ఇప్పుడు అతని సరసన కోహ్లి నిలిచాడు.
మినిమమ్ వంద:
వరుసగా మూడు టెస్ట్ సిరీస్ లలోనూ మినిమమ్ వంద స్కోరు చేసి కోహ్లి ఆరో ఆటగాడిగా నిలిచాడు. కోల్కతా టెస్టులో జరిగిన మొదటి మ్యాచ్లో 104, నాగ్పూర్తో జరిగిన రెండో మ్యాచ్లో 213, మూడో మ్యాచ్లో 243 పరుగులను తన ఖాతాలో వేసుకున్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.