డర్బన్: ప్రతిష్టాత్మక టెస్టు ఛాంపియన్షిప్ను అత్యుత్తమ జట్టు అయిన భారత్తో ప్రారంభించడం సవాలే అని దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ అభిప్రాయపడ్డారు. వెస్టిండీస్ పర్యటన అనంతరం భారత్ సెప్టెంబర్లో దక్షిణాఫ్రికాతో సిరీస్ ఆడనుంది. దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో ఇరు జట్లు మూడు టీ20, మూడు టెస్టులు ఆడుతాయి.
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7 ప్రత్యేక వార్తల కోసం
టెస్టు ఛాంపియన్షిప్ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాల మధ్య యాషెస్ 2019 సిరీస్ ద్వారా ప్రారంభం అవుతుంది. వెస్టిండీస్ పర్యటనతో భారత్ ప్రారంభిస్తుంది. ఇక దక్షిణాఫ్రికా టెస్టు ఛాంపియన్షిప్ను భారత్తో ప్రారంభిస్తుంది. ఈ సందర్భంగా కెప్టెన్ డుప్లెసిస్ మీడియాతో మాట్లాడుతూ... 'భారత్తో టెస్ట్ మ్యాచ్ అంటే సవాలే. ఏ జట్టును అడిగినా ఇదే చెపుతారు. టెస్టు ఛాంపియన్షిప్ భారత్తో ఆరంభించడం సవాలుగా నిలుస్తుంది. అయినా భారత్తో ఆడేందుకు సిద్ధంగా ఉన్నాం' డుప్లెసిస్ అన్నారు.
'దక్షిణాఫ్రికా ఆటగాళ్లు టెస్టు ఛాంపియన్షిప్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆటగాళ్లకి ఇది కొత్త ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ప్రస్తుతం ప్రొటీస్ టెస్టు జట్టులో మంచి అనుభవమున్న ఆటగాళ్లు ఉన్నారు. కొందరు సీనియర్ ఆటగాళ్లు తప్పుకోనున్న నేపథ్యంలో యువకులు జట్టుతో కలుస్తారు. దక్షిణాఫ్రికాకు మంచి భవిష్యత్తు ఉంది' అని డుప్లెసిస్ అభిప్రాయపడ్డాడు.
'టెస్టు ఛాంపియన్షిప్తో టెస్టు క్రికెట్కు విశేష ఆదరణ లభించనుంది. అన్ని జట్ల మధ్య పోటీ వాతావరణం నెలకొంటుంది. ఆటగాళ్లూ అందరూ టెస్టు క్రికెటే అత్యుత్తమైందని భావిస్తారు. ఇక అభిమానులు ఈ ఫార్మాట్ ఆటని ఆస్వాదిస్తారు. టెస్టు క్రికెటే ఆటగాడి సత్తా నిరూపిస్తుంది' అని డుప్లెసిస్ పేర్కొన్నాడు.