హైదరాబాద్: నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఈ సిరిస్లో కోహ్లీ సేనను కట్టడి చేయాలంటే ఆస్ట్రేలియా బౌలర్లు సమిష్టిగా రాణించాలని పలువురు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు చెబుతుండటాన్ని మనం చూశాం.
అయితే ఆసీస్ మాజీ క్రికెటర్ మైక్ హస్సీ మాత్రం ఈ సిరీస్లో విరాట్ కోహ్లీకి టీమిండియా పేసర్ మిచెల్ స్టార్క్ గట్టి సవాల్ విసురుతాడనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 'స్టార్క్ తెలివైన బౌలర్. ఉపఖండం పరిస్థితులకు బాగా సరిపోతాడు. కొత్త బంతితో కచ్చితమైన వేగాన్ని స్వింగ్ను రాబడతాడు' అని హస్సీ చెప్పాడు.
'స్టార్క్ అద్భుతమైన రివర్స్ స్వింగ్ చేస్తాడు. కచ్చితంగా ఈ సిరీస్ మొత్తం కోహ్లీకి అతడు గట్టి పోటీ ఇస్తాడు' అని హస్సీ పేర్కొన్నాడు. స్పిన్ బౌలింగ్ను ఎదుర్కొనడంలో టీమిండియా ఛాంపియన్ అనే విషయాన్ని పక్కనబెడితే, ఉపఖండంలో విజయం సాధించాలంటే ఆసీస్ స్పిన్నర్లు లియోన్, ఓ కీఫీలను సమర్థంగా ఉపయోగించుకోవాలన్నాడు.

ఆసీస్ స్పిన్నర్లపై కెప్టెన్ స్టీవ్ స్మిత్ నమ్మకం పెట్టాలన్నాడు. ఈ విషయంలో స్మిత్ చాలా ఓపికగా వ్యవహరించాలని హస్సీ సూచించాడు. భారత్లో ఉండే భిన్నమైన పిచ్లపై రకరకాల సవాళ్లు ఎదురువుతాయని చెప్పిన హస్సీ.. వీటిని వార్నర్, స్మిత్ దీటుగా ఎదుర్కొంటారని ఆశాభావం వ్యక్తం చేశాడు.
భారీ స్కోర్లు చేయాలని కెప్టెన్ స్టీవ్ స్మిత్తో పాటు, వార్నర్లపై ఎప్పుడూ ఒత్తిడి ఉంటుంది. వీళ్లు కూడా పరుగుల దాహంతో ఉన్నారని అన్నాడు. భారత్ నుంచి గట్టి సవాల్ ఎదురవుతుందని, ఈ సిరిస్లో స్మిత్, వార్నర్లు స్పష్టమైన ముద్ర చూపుతారని పేర్కొన్నాడు.
భారత పర్యటనకు రానున్న ఆస్ట్రేలియా జట్టు గత కొంతకాలంగా ప్రత్యేకంగా దృష్టి సారించిందని, ఈ సిరిస్ సన్నాహాకాలు కూడా బాగున్నాయని హస్సీ తెలిపాడు. భారత పర్యటనపై క్రికెట్ ఆస్ట్రేలియా కూడా ఫోకస్ పెట్టిందని, ఇక మైదానంలో మన ప్రదర్శన చూపడం ఒక్కటే మిగిలిందన్నాడు.
ఈ సిరిస్కు ముందు మరికొన్ని వార్మప్ మ్యాచ్లు ఉంటే బాగుండేదనే అభిప్రాయాన్ని హస్సీ వ్యక్తం చేశాడు. భారత టాప్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాను ఎదుర్కొవాంటే ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్కు స్పష్టమైన ప్రణాళికలు ఉండాల్సిందేనని హస్సీ వెల్లడించాడు.