
హైదరాబాద్: భారత్తో మూడు టీ20 మ్యాచ్ల సిరీస్తో పాటు, నవంబర్ 17న దక్షిణాఫ్రికాతో జరగనున్న ఏకైక టీ20కి ఆస్ట్రేలియా జట్టుని ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. మొత్తం 13 మంది సభ్యులతో కూడిన జట్టుకు ఆరోన్ ఫించ్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. నవంబర్ 21 నుంచి భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు టీ20ల సిరిస్ ప్రారంభం కానుంది.
ఈ టీ20 సిరిస్లో ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్, స్పిన్నర్ నాథన్ లియోన్, ఆల్రౌండర్ మిచెల్ మార్ష్, వెటరన్ పేసర్ పీటర్ సిడిల్కు ఆసీస్ సెలక్టర్లు చోటు కల్పించలేదు. వీళ్లందరూ షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో ఆడి ఇండియా, శ్రీలంకలతో జరగబోయే టెస్ట్ సిరీస్లకు సిద్ధమవుతారని కోచ్ జస్టిన్ లాంగర్ చెప్పాడు. వీళ్ల స్థానంలో మార్కస్ స్టోయినిస్, జేసన్ బెహ్రాండార్ఫ్లకు చోటు కల్పించారు.
టీ20 సిరిస్ అనంతరం భారత్తో నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఉన్న నేపథ్యంలో ఈ టీ20 జట్టులో చోటు కల్పించలేదని కోచ్ జస్టిన్ లాంగర్ తెలిపాడు. లాంగర్ మాట్లాడుతూ "యూఏఈ నుంచి జట్టు తిరిగి స్వదేశానికి రాగానే సమ్మర్లో వరల్డ్ కప్తో పాటు యాషెస్ సిరిస్లు ఉంటాయి. టీ20తో పాటు టెస్టు సిరిస్లో జట్టుని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం" అని తెలిపాడు. తాజాగా ప్రకటించిన జట్టులో పేస్ బౌలర్ జోసన్ బెహ్రాన్డార్ఫ్ తిరిగి చోటు దక్కించుకున్నాడు.
పేస్ బౌలింగ్ విభాగంలో బెహ్రాన్డార్ఫ్తో పాటు నాథన్ కౌల్టర్-నైల్, బిల్లే స్టాన్లేక్, ఆండ్రూ టై కొత్త బంతిని పంచుకోనున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు అత్యంత దయనీయ స్థితిలో ఉంది. చివరి 19 వన్డేల్లో 17 మ్యాచుల్లో ఓడింది. ఇక తాజాగా పాకిస్థాన్ చేతిలో 0-3తో టీ20 సిరీస్ను కూడా ఓడిపోయింది.
ఆసీస్ జట్టు: ఆరోన్ ఫించ్(కెప్టెన్), ఆలెక్స్ కారే(వైస్ కెప్టెన్), అష్టన్ అగర్, జోసన్ బెహ్రన్డార్ఫ్, నాథన్ కౌల్టర్-నైల్, క్రిస్ లియన్, గ్లెన్ మ్యాక్స్వెల్, బెన్ మెక్డర్మోట్, డీఆర్చీ షార్ట్, బిల్లే స్టాన్లేక్, మార్కస్ స్టోయినిస్, ఆండ్రూ టై, ఆదామ్ జంపా.