
హైదరాబాద్: క్రికెట్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే చాలు దానికున్న క్రేజే వేరు. ఇరుదేశాల్లోని అభిమానులు తమ జట్టు గెలవాలంటే తమ జట్టు గెలవాలంటూ ప్రార్థనలు కూడా చేస్తుంటారు. రసవత్తరంగా సాగే ఈ పోరుని వీక్షించేందుకు గాను ప్రతి ఒక్కరూ ఆసక్తిని కనబరుస్తారు.
భారత్-పాక్ మ్యాచ్ అంటే టీవీ ఛానళ్లకు కూడా పండుగే. ఈ మ్యాచ్ని ప్రసారం చేసే టీవీ ఛానళ్లు ఎంతో ఆసక్తికరంగా వీడియోలు, ఆడియోలతో ప్రచారం నిర్వహిస్తాయి. 2011 వరల్డ్ కప్ సందర్భంగా వచ్చిన 'మోకా మోకా' థీమ్ ప్రపంచ వ్యాప్తంగా ఎంత పెద్ద సూపర్ హిట్టో అందరికీ తెలిసిందే.
ఇక, ఇంగ్లాండ్ వేదికగా గతేడాది జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా మోకా స్థానంలో 'సబ్సే బడా మోహ్' వీడియోకి ప్రాచుర్యం కల్పించింది స్టార్ నెట్ వర్క్. త్వరలో ప్రారంభం కానున్న ఆసియా కప్ కోసం భారత్-పాక్ జట్ల మధ్య సరికొత్త థీమ్ను స్టార్ ఇండియా తీసుకొచ్చింది.
దాని పేరే 'పొరుగుVsపొరుగు'. ఇందుకు సంబంధించిన వీడియోని స్టార్ ఇండియా తన అధికారిక ట్విట్టర్లో అభిమానులతో పంచుకుంది. ఇందులో పక్కింటాయన బండి గురించి పొగిడి దాన్నెవరో ఎత్తుకు పోతున్నారని చెప్పడం, ఇద్దరమ్మాయిలు మరో అమ్మాయి దుస్తులను ప్రశంసించి చాటుగా అవి ఫ్యాషన్ బజార్లో కొన్నవని వెక్కిరించడం, ఓ ఉద్యోగి జీతం పెరిగిన సహచరుడికి శుభాకాంక్షలు చెప్పి తనకు పదోన్నతి లభించిందని మిఠాయి ఇవ్వడం వంటివి ఆసక్తికరంగా అనిపిస్తాయి.