హైదరాబాద్: బీసీసీఐ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. ఒకవైపు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బలు, మరొకవైపు ఐసీసీలో తన ఆధిపత్యాన్ని కోల్పోవడం ఇలా ఒక దాని తర్వాత మరొక సమస్య బీసీసీఐని వేధిస్తున్నాయి. దీనికి తోడు ఆస్ట్రేలియాతో పూణెలో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు ఘోర ఓటమిని చవిచూసింది.
ఈ సమయంలో టీమిండియా జెర్సీ స్పాన్సర్షిప్ను కొనసాగించేందుకు 'స్టార్ ఇండియా' నిరాకరించింది. బీసీసీఐ-స్టార్ ఇండియా మధ్య జరిగిన స్పాన్సర్షిప్ ఒప్పందం మార్చి నెలతో ముగియనుంది. ప్రస్తుతం బీసీసీఐ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని, స్పష్టత కనిపించడం లేదని స్టార్ ఇండియా చైర్మన్ అండ్ సీఈవో ఉదయ్ శంకర్ అన్నారు.

దీంతో జెర్సీ స్పాన్సర్షిప్ ఒప్పందాన్ని కొనసాగించేందుకు జరిగే బిడ్డింగ్లో తాము పాల్గొనబోమని ఆయన చెప్పారు. జెర్సీ స్పాన్సరర్గా ఎంపికైన సంస్థ పేరుని భారత పురుషుల, మహిళల సీనియర్ జట్లతోపాటు అండర్ 19, ఇండియా 'ఏ' జట్ల జెర్సీలపై కూడా ముద్రిస్తారు.
2013 డిసెంబర్లో సహారా తప్పుకోవడంతో, అప్పటినుంచి స్టార్ ఇండియా బీసీసీఐ ప్రధాన టీమ్ స్పాన్సరర్గా వ్యవహరిస్తోంది. స్టార్ ఇండియా స్పాన్సరర్గా ఉన్నందుకు గాను ద్వైపాక్షిక సిరీస్లో జరిగే మ్యాచ్కు దాదాపు రూ. 2 కోట్లు, ఐసీసీ టోర్నీల్లో రూ.61 లక్షలు బీసీసీఐకి ఇస్తోంది.