అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకకు సర్వం సిద్ధమైంది. ఇవాళ మధ్యాహ్నం 12.20కి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమై ఒంటి గంటకు ముగియనుంది. ఈ మహోజ్వల ఘట్టం కోసం దేశమంతా భక్తి పారశవ్యంలో మునిగిపోయంది. పండగ వాతావరణం నెలకొంది. మరోవైపు స్టార్ క్రికెటర్లు శ్రీరాముడి సేవలో పాల్గొనడానికి ఇప్పటికే అయోధ్య చేరుకున్నారు.
రామ మందిర ప్రారంభోత్సవానికి సుమారు ఏడు వేల మంది అతిథులను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆహ్వానించిన విషయం తెలిసిందే. రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులు ఇందులో ఉన్నారు. సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్, రవిచంద్రన్ అశ్విన్, కపిల్ దేవ్, రాహుల్ ద్రవిడ్, రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్ క్రికెటర్లకు ఆహ్వానం అందింది. మహిళా క్రికెటర్లలో మిథాలీ రాజ్, హర్మన్ప్రీత్ కౌర్ను స్వాగతించారు.
అయితే అయోధ్యకు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి ఆదివారం రాత్రి బయలుదేరారు. తాజాగా రవీంద్ర జడేజా, అనిల్ కుంబ్లే, మిథాలీ రాజ్ అక్కడికి చేరుకున్నారు. అనిల్ కుంబ్లే తన భార్యతో రాముడి సేవలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కుంబ్లే మాట్లాడుతూ.. రామమందిర ప్రారంభోత్సవం గొప్ప వేడుకని, ఇందులో భాగమవడాన్ని తన అదృష్టంగా భావిస్తున్నాని పేర్కొన్నాడు.
మరోవైపు తన భక్తిని చాటుకుంటూ దక్షిణాఫ్రికా క్రికెటర్ కేశవ్ మహరాజ్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపాడు. ఈ అద్భుతమైన రోజు ప్రతి ఒక్కరి జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నాడు. రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ వేడుక ఘనంగా జరగాలని కోరుకుంటున్నాని తెలిపాడు. శాంతి, సామరస్యం, ఆధ్యాత్మిక జ్ఞానోదయం అందరిలో కలగాలని కేశవ్ మహరాజ్ పేర్కొన్నాడు.
