వన్డే వరల్డ్ కప్కు ముందు వన్డే ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన బంగ్లా స్టార్ తమీమ్ ఇక్బాల్ యూటర్న్ తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పేస్తున్నాంటూ మీడియా సమావేశంలో ఎమోషనల్ అయిపోయిన తమీమ్ ఇక్బాల్.. ఇప్పుడు తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు.
ఆఫ్ఘనిస్తాన్తో మూడు వన్డేల సిరీసులో తొలి వన్డేలో బంగ్లాదేశ్ గెలిచింది. ఆ తర్వాతే ఇక్బాల్ ఈ షాకింగ్ ప్రకటన చేశాడు. ఇది చూసిన ఫ్యాన్స్ షాకైపోయారు. వరల్డ్ కప్కు టీం రెడీ అవుతున్న సమయంలో ఇక్బాల్ ఇలా రిటైర్మెంట్ ప్రకటించడం చూసి ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా ఎమోషనల్ అయిపోయిన ఇక్బాల్.. 'ఇక ఇది నా కెరీర్కు ముగింపు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్ నాకు చివరిది. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు చెప్తున్నా' అని చెప్పాడు.

అయితే ఇప్పుడు ఇక్బాల్ యూటర్న్ తీసుకున్నాడు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) కూడా ధ్రువీకరించింది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఈ విషయంలో కలుగ జేసుకున్నారని, అందుకే ఇక్బాల్ తన నిర్ణయం వాపస్ తీసుకున్నాడని తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం ఇక్బాల్ను తనతో సమావేశం అవ్వాలని ప్రధాని కోరారట. ఈ క్రమంలో ఆమెతో మీటింగ్ అనంతరం తన నిర్ణయాన్ని ఇక్బాల్ మార్చుకున్నాడు.
ఈ సమావేశంలో ఇక్బాల్, అతని భార్య, బంగ్లా మాజీ కెప్టెన్ మష్రాఫే మొర్తాజా, బీసీబీ ప్రెసిడెంట్ నజ్ముల్ హసన్ కూడా పాల్గొన్నారు. అయితే మళ్లీ ఆసియా కప్లో ఆడే ముందు ఇక్బాల్ ఒకటిన్నర నెలల విశ్రాంతి తీసుకుంటాడని సమాచారం. ఆసియా కప్ తర్వాత వన్డే వరల్డ్ కప్లో కూడా తమీమ్.. ఈ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తాడని తెలుస్తోంది. మరి ఈ రెండు టోర్నీల తర్వాత మళ్లీ ఇక్బాల్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడేమో చూడాలి.