టీమిండియా స్టార్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ గురించి అందరికీ తెలిసిందే. మైదానంలో తన ఆల్రౌండ్ ప్రదర్శనతో అభిమానులను అలరించే శార్దూల్ ఠాకూర్ వ్యక్తిగత జీవితం కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా మంది క్రికెటర్లలాగే, శార్దూల్ ప్రేమ కథ కూడా బాల్యం నుంచే మొదలైంది. ఒక బిజినెస్మెన్ కూతురు అయిన తన ప్రియురాలిని స్కూల్ రోజుల్లోనే ప్రేమించి, ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నాడు. శార్దూల్ భార్య మిథాలీ పారుల్కర్ గురించి, వారి ప్రేమ ప్రయాణం గురించి వివరంగా తెలుసుకుందాం.
శార్దూల్-మిథాలీ.. స్కూల్ డేస్ ప్రేమాయణం
శార్దూల్ ఠాకూర్, మిథాలీ పారుల్కర్ల తొలి పరిచయం మహారాష్ట్రలోని వారి స్కూల్ రోజుల్లో జరిగింది. స్కూల్లో వారిద్దరూ స్నేహితులుగా మొదలై, ఆ స్నేహం కాస్త గాఢమైన ప్రేమగా మారింది. ఆ సమయంలో తాను భవిష్యత్తులో ఒక వ్యాపారవేత్త కూతురిని పెళ్లి చేసుకోబోతున్నాడని శార్దూల్కు కూడా తెలియదు. వారి ప్రేమ ప్రయాణం చాలా ఏళ్లు సాగింది. ఆ సమయంలో వారి మధ్య బంధం మరింత బలపడింది. చాలా సంవత్సరాలు డేటింగ్ చేసిన అనంతరం.. శార్దూల్ నవంబర్ 2021లో ముంబైలో జరిగిన ఒక నిరాడంబరమైన నిశ్చితార్థ వేడుకలో మిథాలీకి ప్రపోజ్ చేశాడు. ఈ వేడుకకు శార్దూల్ సన్నిహిత స్నేహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. భారత క్రికెట్ జట్టులోని సహచరులు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ కూడా ఎంగేజ్మెంట్ వేడుకకు హాజరై ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు.

వైభవంగా వివాహం
ఎంగేజ్మెంట్ జరిగిన రెండేళ్ల తర్వాత, 2023 ఫిబ్రవరి 27న శార్దూల్ ఠాకూర్, మిథాలీల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ముంబై సమీపంలోని కర్జాత్లో మరాఠీ సంప్రదాయ శైలిలో ఈ వివాహ వేడుకను నిర్వహించారు. ఈ పెళ్లికి భారత క్రికెట్ ప్రపంచం నుంచి అనేక ప్రముఖులు హాజరయ్యారు. రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్ వంటి క్రికెటర్లు ఈ వేడుకకు వచ్చి నూతన వధూవరులను అభినందించారు.
వ్యాపారవేత్తగా ఎదిగిన మిథాలీ పారుల్కర్
శార్దూల్ ఠాకూర్ భార్య మిథాలీ పారుల్కర్ నేపథ్యం కూడా ఆసక్తికరమే. ఆమె తండ్రి ఒక వ్యాపారవేత్త కాగా, తల్లి గృహిణి. మిథాలీ పారుల్కర్ తన స్కూల్ విద్యను పూర్తి చేసిన అనంతరం బీకాం డిగ్రీని అభ్యసించింది. ప్రారంభంలో ఆమె ఒక కంపెనీ సెక్రటరీగా తన వృత్తిని ప్రారంభించింది. అయితే ఆ పని ఆమెకు సంతృప్తిని ఇవ్వలేదు. తనకున్న ఆసక్తి, అభిరుచితో మిథాలీ సొంతంగా ఒక బేకరీ వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంది. ఆమె వ్యాపార నైపుణ్యం, కృషి ఫలితంగా.. ప్రస్తుతం బేకరీ వ్యాపారం కోట్లాది రూపాయల టర్నోవర్ను సాధిస్తోంది. మిథాలీ తన సొంత కాళ్లపై నిలబడి, ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా తనదైన గుర్తింపును తెచ్చుకుంది.