RCB Victory Stampede: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటకు సంబంధించి భారత్, ఆర్సీబీ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ఈ ఫిర్యాదును సీనియర్ సామాజిక కార్యకర్త హెచ్ఎం వెంకటేష్ దాఖలు చేశారు. దీనికి స్పందించిన పోలీసుల ఒక వివరణ జారీ చేశారు. ఈ ఫిర్యాదును ఇప్పటికే నమోదు చేసిన కేసు కింద పరిశీలిస్తామని, కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా విచారిస్తామని చెప్పారు.
జూన్ 3న జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) విజయం సాధించి 18 ఏళ్ల తర్వాత తమ మొదటి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని జూన్ 4 బెంగళూరులో వేడుకలు నిర్వహించాలని ఫ్రాంచైజీ నిర్ణయించింది. అయితే ఈ ఆనందం విషాదంగా మారింది. బెంగళూరులో వేడుకలు జరుపుకోవడానికి గుమిగూడిన లక్షలాది అభిమానుల మధ్య అకస్మాత్తుగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.

విరాట్ కోహ్లీపై ఎవరు ఫిర్యాదు చేశారు?
ఈ కేసులో విరాట్ కోహ్లీని ప్రధాన నిందితుడిగా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక సామాజిక కార్యకర్త కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. పోలీసులు ఫిర్యాదును అంగీకరించి తొక్కిసలాటకు సంబంధించి ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, వారి ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తామని తెలిపారు.
నిఖిలే సోసాలే అరెస్ట్
కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ముంబైకి విమానంలో బయలుదేరడానికి వేచి ఉన్న ఆర్సీబీ మార్కెటింగ్ అండ్ రెవెన్యూ హెడ్ నిఖిల్ సోసాలేను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్సీబీ వేడుకలకు బాధ్యత వహించే ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్లో పనిచేస్తున్న కిరణ్ కుమార్(సీనియర్ ఈవెంట్ మేనేజర్), సునీల్ మాథ్యూ(వైస్ ప్రెసిడెంట్-బిజినెస్ అఫైర్స్)లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.