SS Rajamouli: ఐపీఎల్ క్వాలిఫయర్-2 మ్యాచ్లో ముంబై ఇండియన్స్ను పంజాబ్ కింగ్స్ జట్టు చిత్తు చేసింది. శ్రేయస్ అయ్యర్ 41 బంతుల్లోనే 87 పరుగులు చేసి పంజాబ్ కింగ్స్ జట్టును ఐపీఎల్ ఫైనల్కు చేర్చాడు. 11 ఏళ్ల తర్వాత పంజాబ్ జట్టు ఐపీఎల్ ఫైనల్లో ఆడనుంది. ఈ క్రమంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 క్వాలిఫయర్ -2 మ్యాచ్పై ఎస్ఎస్ రాజమౌళి ట్వీట్ చేశారు. పంజాబ్ కింగ్స్ అద్భుతమైన విజయం సాధించడంపై రాజమౌళి ప్రశంసలు కురిపించారు. జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ యార్కర్లను థర్డ్ మ్యాన్ దిశగా బౌండరీకి తరలించడంపై పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ను కొనియాడారు. శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ అద్భుతంగా ఉందని ట్వీట్లో పేర్కొన్నారు.
శ్రేయస్ గతంలో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లను ఫైనల్ కు తీసుకువచ్చి టైటిల్ మిస్ చేసుకున్నాడని.. మళ్లీ దాదాపు 11 ఏళ్ల తర్వాత పంజాబ్ కింగ్స్ జట్టును ఫైనల్ వరకు తీసుకొచ్చిన శ్రేయస్ అయ్యర్ టైటిల్ కొట్టేందుకు పూర్తి అర్హుడని దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు విరాట్ కోహ్లీ ఆర్సీబీ తరఫున వేల పరుగులు సాధించాడని.. ఐపీఎల్ టైటిల్ గెలిచేందుకు సమయం ఆసన్నమైందని దర్శకుడు పేర్కొన్నారు. ఈ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో రిజల్ట్ ఏదైనా హార్ట్ బ్రేకింగ్ మాత్రం తప్పదని దర్శకధీరుడు రాజమౌళి అంటున్నారు.

వర్షం అంతరాయం కలిగించిన ఈ క్వాలిఫయర్-2 మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 203 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 44), తిలక్ వర్మ(29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 44)లతో పాటు నమన్ ధీర్(18 బంతుల్లో 7 ఫోర్లతో 37) రాణించారు. పంజాబ్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ రెండు వికెట్లు తీయగా.. కైల్ జెమీసన్, మార్కస్ స్టోయినీస్, విజయ్కుమార్ వైశాఖ్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీశారు
అనంతరం పంజాబ్ కింగ్స్ 19 ఓవర్లలో 207 పరుగులు చేసి గెలుపొందింది. శ్రేయస్ అయ్యర్తో పాటు నెహాల్ వధేరా(29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 48), జోష్ ఇంగ్లీస్(21 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 38) రాణించారు. ముంబై బౌలర్లలో అశ్వని కుమార్ రెండు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ పడగొట్టారు.