టీమిండియాకు శ్రీలంక గట్టి షాకే ఇచ్చింది. టీ20 వరల్డ్ కప్ సాధించి మంచి ఊపు మీద ఉన్న భారత జట్టు శ్రీలంక చేతిలో దారుణంగా ఓడిపోయింది. టీ20ను 0-3తో వైటావాష్ చేసిన టీమిండియా ,వన్డేలకు వచ్చే సరికి లంక చేతిలో దారుణంగా ఓడిపోయింది. శ్రీలంక బౌలర్ల దాటికి టీమిండియా బ్యాట్స్మెన్లు పెవిలయన్కు క్యూ కట్టారు. రోహిత్, విరాట్ కోహ్లిలు జట్టులో ఉన్నప్పటికి ఓటమి నుంచి జట్టును కాపాడలేకపోయారు. మొదటి వన్డేను డ్రా చేసుకున్న భారత జట్టు, తర్వాత రెండు మ్యాచుల్లో దారుణ ఓటమిని చవి చూసింది.
ఈ సిరీస్లో టీమిండియా స్పిన్ ఆడటంలోనే దారుణంగా విఫలం అయింది. ఫలితంగా 27 ఏళ్ల తర్వాత టీమిండియాపై శ్రీలంక సిరీస్ నెగ్గగలిగింది. మరోవైపు భారత లాంటి పటిష్టమైన జట్టుపై సిరీస్ గెలవడంతో శ్రీలంక జట్టు ఆనందంలో మునిగి తేలుతోంది. శ్రీలంక జట్టు ఇప్పుడు సెలబ్రేషన్స్లో బిజీగా ఉంది. భారత్ లాంటి బలమైన జట్టుపై సిరీస్ నెగ్గడంతో ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు . అయితే కొంతమంది శ్రీలంక ఆటగాళ్లు భూమ్మీద ఆగడం లేదు. సొంతగడ్డపై ఓ రెండు మ్యాచ్ల్లో ఇండియాను ఓడించగానే.. పెద్ద పెద్ద స్టేమ్మెంట్లు ఇస్తున్నారు.

తాజాగా శ్రీలంక స్పిన్నర్ మహీష్ తీక్షణ భారత క్రికెటర్లపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. సిరీస్ విజయం తర్వాత తీక్షణ మాట్లాడుతూ.. 'టీమిండియా క్రికెటర్లు బ్యాటింగ్ అనుకూలించే పిచ్లపైనే ఎక్కువగా ఆడుతుంటారు, ఇండియాలో అలాంటి పిచ్లే ఉంటాయని, పైగా అక్కడి బౌండరీలు కూడా చాలా చిన్నవి ఉంటాయి. కానీ, ప్రేమదాస స్టేడియంలో బాల్ టర్న్ అవుతుంది, దాన్ని మేం అడ్వాంటేజ్గా ఉపయోగించుకున్నాం' అంటూ చెప్పుకొచ్చాడు.
స్పిన్నర్ మహీష్ తీక్షణ చేసిన కామెంట్స్పై ఇండియా క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఏదో రెండు మ్యాచ్లు ఓడిపోగానే, స్పిన్తో టీమిండియాను కొట్టేశామని ఓవర్ యాక్షన్ చేస్తున్నారని మండిపడుతున్నారు. మీరు స్పిన్ బౌలింగ్లో అంత తోపులు అయి ఉంటే.. మరి టీ20 సిరీస్ను 3-0తో ఎందుకు ఓడిపోయారంటూ మహీష్ తీక్షణకు ఇండియాన్ ఫ్యాన్స్ చురకులు అంటిస్తున్నారు. దీనికి కచ్చితంగా రివేంజ్ ఉంటుందని భారత అభిమానులు శపథాలు చేస్తున్నారు.