హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్లో పరిచయం అక్కర్లేని పేరు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న క్రికెటర్. ధోనితో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు పోటీ పడతారు. తాజాగా శ్రీలంక పర్యటనలో ఉన్న ధోని కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో నాలుగో వన్డే కోసం ప్రాక్టీస్ చేస్తుండగా ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది.
ఓ శ్రీలంక అభిమాని అకస్మాత్తుగా మైదానంలో దూసుకొచ్చిన ధోని ప్రాక్టీస్ సెషన్ అడ్డుకున్నాడు. ధోని బ్యాటింగ్ చేస్తుండగా మధ్యలో వచ్చి అతను సెల్ఫీ తీసుకోవడం భారత ఆటగాళ్లను విస్మయపరిచింది. అయితే ఆ అభిమాని ఎలా వచ్చాడో తెలియదు.. భద్రతా సిబ్బందిని దాటుకుని అతడు భారత ఆటగాళ్లను సమీపించాడు.

దూరం నుంచి రోహిత్ శర్మని చూసి ధోని అనుకుని మొదట అతడి వద్దకు వెళ్లాడు. ఇంతలో అతడు ధోనీ కాదని గుర్తించాడు. ధోనీ కోసం వచ్చానని రోహిత్కి చెప్పగా ధోని అక్కడ ఉన్నాడని రోహిత్ చూపించాడు. పట్టరాని సంతోషంతో ధోనీ వద్దకు వెళ్లిన ఆ అభిమాని అతనితో సెల్ఫీ దిగాడు.
అభిమానితో హుందాగా ప్రవర్తించిన ధోనీ సెల్ఫీ దిగిన అనంతరం గప్చుప్గా వెళ్లాలని అతనికి సూచించాడు. ఇంతలో సమీపంలో ఉన్న భారత అధికారులు గుర్తించి అక్కడికి చేరుకుని అతన్ని బయటికి పంపించివేశారు. మైదానంలో మధ్యలోకి అతను ఎలా వచ్చాడని ఆరా తీయగా.. అతను నాలుగో వన్డే జరిగే ఆర్ ప్రేమదాస స్టేడియం సిబ్బంది అని, అందుకే భద్రతా సిబ్బంది అతడ్ని ఆపలేదని తెలిసింది.