
కొలొంబో: కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కారణంగా ఈ ఏడాది మార్చి నెల చివరి వారం నుంచి ప్రపంచవ్యాప్తంగా అన్నీ క్రీడా టోర్నమెంట్లు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే అనేక దేశాలు లాక్డౌన్ సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో క్రికెట్ పునరుద్దరణకు బాటలు పడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తుంటే.. త్వరలోనే క్రికెట్ మ్యాచ్లు జరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) బౌలర్ల కోసం ప్రత్యేకంగా శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసింది. దీంతో ఇంగ్లండ్ బాటలో మరిన్ని దేశాలు పయనించేందుకు సిద్దమవుతున్నాయి.
తాజాగా శ్రీలంక తమ ఆటగాళ్ల కోసం ముఖ్యంగా బౌలర్ల కోసం ట్రెయినింగ్ సెషన్ ఏర్పాటు చేసింది. ఈ శిక్షణా శిబిరం సోమవారం నుంచి ప్రారంభం కానుంది. కొలంబో క్రికెట్ క్లబ్లో 12 రోజుల క్యాంపులో 13 మంది ఆటగాళ్లు పాల్గొంటారని శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) ప్రకటన విడుదల చేసింది. అంతేకాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొంది. 'మూడు ఫార్మాట్లలో కలిపి ఆటగాళ్లని ఎంపిక చేయడం జరిగింది. అందులో ఎక్కువ శాతం బౌలర్లే. పోటీలో పాల్గొనే ముందు వారికి మరింత శిక్షణ ఇవ్వడం జరుగుతుంది' అని ప్రకటనలో పేర్కొంది.
ప్రభుత్వ నిబంధనల ఆధారంగానే క్యాంపు నిర్వహిస్తున్నామని ఎస్ఎస్సీ పేర్కొంది. ఆటగాళ్లను పరిశీలించేందుకు నలుగురు సిబ్బంది ఉంటారని.. క్యాంపు ముగిసేవరకూ ఆటగాళ్లు హోటల్, ప్రాక్టీస్ వేదిక విడిచి బయటకు వెళ్లేందుకు వీలు లేదని స్పష్టం చేసింది. అన్నీ కుదిరితే జులైలో స్వదేశంలో టీమిండియాతో వన్డే/టీ20 సిరీస్ నిర్వహించాలని శ్రీలంక భావిస్తోంది. అయితే కరోనా పరిస్థితులు, అంతర్జాతీయ సర్వీసుల పునరుద్దరణ తర్వాతే తమ నిర్ణయం ఏంటో చెప్పగలమని బీసీసీఐ తేల్చిచెప్పింది.
ఇక దక్షిణాఫ్రికా కూడా క్రికెట్ పునరుద్దరణ చర్యలు చేపట్టింది. ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా వేర్వేరు మైదానాల్లో తమ ఆటగాళ్ల కోసం ట్రైయినింగ్ సెషన్స్ ఏర్పాటు చేయాలని దక్షిణాఫ్రికా భావిస్తోంది. కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరుగాల్సిన టీ20 ప్రపంచకప్ రద్దు లేదా వాయిదా పడొచ్చని మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) అధ్యక్షుడు కుమార సంగక్కర అభిప్రాయపడ్డాడు. విశ్వటోర్నీపై నిర్ణయం తీసుకునేందుకు కొంతకాలం వేచిచూడాలని, అయితే అప్పుడు కూడా ఆ రెండే ఆప్షన్లుగా ఉండే అవకాశం ఉందన్నాడు.