Saliya Saman: శ్రీలంకకు చెందిన మాజీ క్రికెటర్ సాలియా సమన్పై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఐదేళ్ల నిషేధం విధించింది. మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 2021లో అబుదాబిలో జరిగిన టీ10 క్రికెట్ లీగ్లో మ్యాచ్ ఫలితాలను తారుమారు చేయడానికి ప్రయత్నించాడనే ఆరోపణలు అతనిపై వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఐసీసీ అవినీతి నిరోధక ట్రిబ్యునల్ సాలియా సమన్పై విచారణ జరిపింది. ఈ విచారణలో సాలియా సమన్ మూడు ప్రధాన నేరాలకు పాల్పడినట్లు రుజువైంది.
ప్రధాన ఆరోపణలు.. శిక్ష
ఐసీసీ జరిపిన విచారణలో సాలియా సమన్పై మూడు ముఖ్యమైన ఆరోపణలు రుజవయ్యాయి. అవి..
*టీ10 లీగ్ మ్యాచ్ల ఫలితాలను ప్రభావితం చేయడానికి కుట్ర పన్నడం.
*మ్యాచ్ ఫిక్సింగ్ కోసం మరో ఆటగాడికి డబ్బు లేదా బహుమతులు ఇవ్వడం.
*అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించేందుకు ఇతర ఆటగాళ్లను ప్రోత్సహించడం.

ఈ నేరాలు రుజువు కావడంతో సాలియా సమన్పై ఐదేళ్లపాటు అన్ని రకాల క్రికెట్ కార్యకలాపాల నుంచి నిషేధం విధించారు. ఈ నిషేధం 2023 సెప్టెంబర్ 13న అతను తాత్కాలికంగా సస్పెండ్ అయిన తేదీ నుంచి వర్తిస్తుంది. ఇదే లీగ్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న 8 మందిలో సాలియా సమన్ ఒకరు. బంగ్లాదేశ్ ఆల్రౌండర్ నసీర్ హుస్సేన్కు కూడా ఇదే విధమైన ఆరోపణల కారణంగా రెండేళ్ల నిషేధం విధించబడింది.
సాలియా సమన్ క్రికెట్ కెరీర్
39 ఏళ్ల సాలియా సమన్ తన కెరీర్లో శ్రీలంక తరపున 101 ఫస్ట్-క్లాస్ మ్యాచ్లు, 77 లిస్ట్-ఎ మ్యాచ్లు ఆడాడు. సాలియా సమన్ శ్రీలంక సీనియర్ జట్టుకు ఆడకపోయినా, దేశీయ క్రికెట్లో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈ ఆల్రౌండర్ తన కెరీర్లో 101 ఫస్ట్-క్లాస్, 77 లిస్ట్-ఎ, 47 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్లో అతను 3662 పరుగులు చేసి 231 వికెట్లు తీశాడు. లిస్ట్-ఎ క్రికెట్లో 898 పరుగులు, 84 వికెట్లు సాధించాడు. టీ20 క్రికెట్లో 673 పరుగులు, 58 వికెట్లు తీసుకున్నాడు. కానీ, మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంతో అతని క్రికెట్ కెరీర్ వివాదాస్పదంగా ముగిసింది. క్రికెట్లో అవినీతిని అరికట్టడానికి ఐసీసీ తీసుకున్న ఈ కఠినమైన చర్య, క్రీడల సమగ్రతను కాపాడటానికి నిరంతరంగా కృషి చేస్తుందని మరోసారి నిరూపించింది.