హైదరాబాద్: తాను ఎలాంటి తప్పు చేయకపోయినా... శ్రీలంక ఓపెనర్ ధనుష్క గుణతిలకపై ఆ దేశ క్రికెట్ బోర్డు ఏడాది పాటు సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ సందర్భంగా గుణతిలక బస చేస్తున్న హోటల్ గదిలో అతని స్నేహితుడు నార్వే మహిళపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ప్రాథమిక విచారణ జరిపిన శ్రీలంక క్రికెట్ బోర్డు గుణతిలకపై ఏడాదిపాటు నిషేధం విధించింది. అయితే, తాజాగా ఈ అత్యాచారం కేసులో గుణతిలకపై ఇంకా ఎలాంటి దర్యాప్తు చేయలేదని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఆ క్రికెటర్ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనపై శ్రీలంక క్రికెట్ బోర్డు విచారణ చేసుకోవచ్చని తెలిపారు.
నార్వేకి చెందిన మహిళపై అత్యాచారానికి పాల్పడినందుకు గాను గుణతిలక స్నేహితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు వెల్లడించారు. గుణతిలక స్నేహితుడు ఇంగ్లాండ్లో ఓ క్లబ్ క్రికెటర్ అని, తన తండ్రిని కలిసేందుకు ఇటీవలే శ్రీలంకకు వచ్చాడని కుల్లుపుటియా పోలీస్ స్టేషన్ ఆఫీస్ ఇన్ ఛార్జి మీడియాకు తెలిపారు.
దీంతో తన స్నేహితుడు చేసిన నేరంలో గుణతిలక పాత్ర లేనందున అతడిపై సస్పెన్షన్ను ఎత్తివేసి మళ్లీ జట్టులోకి తీసుకోవడంపై బోర్డు నిర్ణయం తీసుకోనుంది. అయితే, గుణతిలక సస్పెన్షన్ను ఎదుర్కొనడం ఇదే మొదటిసారి కాదు. అక్టోబర్ 2017లో శ్రీలంక క్రికెట్ బోర్డు అతడిపై ఆరు మ్యాచ్ల సస్పెన్షన్ వేటు వేసింది. ఆ తర్వాత నిషేధాన్ని మూడు మ్యాచ్లకు తగ్గించింది.
అసలేం జరిగింది?
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ సందర్భంగా గుణతిలక బస చేస్తున్న హోటల్ గదిలోకి ఆదివారం తన స్నేహితుడు ఇద్దరు నార్వే మహిళల్నితీసుకొచ్చాడు. అందులో ఒక మహిళ తనపై అతను అత్యాచారం జరిపినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు దర్యాప్తు చేసి గుణతిలక స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
లంక బోర్డు ప్రాథమిక విచారణ అనంతరం ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించాడన్న కారణంతో గుణతికలపై కూడా వేటు వేసింది. దీంతో పాటు అతడి వార్షిక కాంట్రాక్టు ఫీజులో కూడా 20 శాతం కోత విధించింది. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్లో గుణతిలక చక్కటి ప్రదర్శన చేశాడు.