అఫ్గానిస్థాన్తో జరుగుతున్న తొలి వన్డేలో శ్రీలంక ఓపెనర్ నిస్సాంక డబుల్ సెంచరీ సాధించాడు. 139 బంతుల్లో అజేయంగా 210 పరుగులు చేశాడు. 20 ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో 25 ఏళ్ల నిస్సాంక లంక క్రికెట్లో చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్గా రికార్డులకెక్కాడు. అంతేగాక లంక తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్గానూ రికార్డు సాధించాడు. గతంలో ఈ రికార్డు సనత్ జయసూర్య (189) పేరిట ఉండేది.
టాస్ ఓడి బ్యాటింగ్కు వచ్చిన లంక నిర్ణీత 50 ఓవర్లలో మూడు వికెట్లకు 381 పరుగులు చేసింది. మరో ఓపెనర్ అవిష్క ఫెర్నాండో (88; 88 బంతుల్లో) సెకండ్ టాప్ స్కోరర్. అయితే లంక ఇన్నింగ్స్ ఉత్కంఠగా సాగింది. ఆఖర్లో నిస్సాంక ద్విశతకం సాధిస్తాడా లేదా అనే టెన్షన్ అందరిలోనూ మొదలైంది. 48 ఓవర్లు ముగిసేసరికి లంక 352/3 స్కోరు చేయగా, నిస్సాంక 187 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

అయితే నిస్సాంకకు 49వ ఓవర్లో మూడు బంతులే లభించాయి. తొలి బంతిని సింగిల్ తీయగా, మరోసారి స్ట్రైకింగ్ రావడం కోసం అతడు అయిదో బంతి వరకు ఎదురుచూశాడు. ఆ తర్వాత రెండు పరుగులు, సిక్సర్ బాది 196తో నిలిచాడు. ఆఖరి ఓవర్లో తొలి బంతికే అసలంక (7*) సింగిల్ తీసి నిస్సాంకకు బ్యాటింగ్కు అవకాశం ఇచ్చాడు. ఫరీద్ అహ్మద్ బౌలింగ్లో బౌండరీ బాది నిస్సాంక డబుల్ సెంచరీ సాధించాడు.
31 బంతుల్లో హాఫ్ సెంచరీని సాధించిన నిస్సాంక 88 బంతుల్లో మూడంకెల స్కోరును సాధించాడు. ఆ తర్వాత 116 బంతుల్లో 150 మార్క్ను అందుకున్నాడు. మరో 20 బంతుల్లో డబుల్ సెంచరీ (136 బంతులు) బాదాడు. కాగా, ఫెర్నాండోతో కలిసి నిస్సాంక తొలి వికెట్కు 182 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే శతకానికి చేరువవుతున్న ఫెర్నాండోను ఫరీద్ అహ్మద్ ఔట్ చేశాడు.
వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ కుశాల్ మెండిస్ (16; 31 బంతుల్లో) విఫలమయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సమరవిక్రమ (45; 36 బంతుల్లో)తో కలిసి నిస్సాంక పరుగులు పెట్టించాడు. అఫ్గానిస్థాన్ బౌలర్లలో ఫరీద్ అహ్మద్ రెండు వికెట్లు, నబీ ఒక వికెట్ తీశాడు.