టీ20ల్లో శ్రీలంక చెత్త రికార్డు.. ఏకంగా 29 సార్లు! కివీస్, ఆస్ట్రేలియా కంటే జింబాబ్వే బెటర్!!

హైదరాబాద్: టీ20 క్రికెట్ అంటేనే వీర బాదుడు. క్రీజులో వచ్చిన ప్రతి బ్యాట్స్మన్ సిక్సులు, ఫోర్లతో మైదానాన్ని హోరెత్తిస్తుంటారు. ఈ క్రమంలో ఒక్కోసారి భారీ స్కోర్లు నమోదవుతుంటాయి. మరోసారి స్వల్ప స్కోర్లు కూడా వస్తాయి. బ్యాట్స్మన్ బంతిని బాదే క్రమంలో చాలాసార్లు త్వరగానే పెవిలియన్ చేరుతుంటారు. ఈ క్రమంలో పలు జట్లు అలౌట్స్ అవుతుంటాయి. అయితే ఇటీవలి కాలంలో వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న శ్రీలంక జట్టు తన పేరుపై ఓ చెత్త రికార్డును లికించుకుంది. టీ20ల్లో అత్యధికసార్లు ఆలౌట్ అయిన జట్టుగా లంక అగ్రస్థానంలో ఉంది.

29 సార్లు శ్రీలంక ఆలౌట్:
టీ20ల్లో ఏకంగా 29 సార్లు శ్రీలంక ఆలౌట్ అయింది. 2006 నుంచి పొట్టి ఫార్మాట్ ఆడుతున్న లంక 29 సార్లు ఆలౌట్ అయి అగ్రస్థానంలో ఉంది. కొలంబో వేదికగా ఆదివారం టీమిండియాతో జరిగిన తొలి టీ20లో లంక 18.3 ఓవర్లలో 126 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో తన చెత్త రికార్డును మరింత మెరుగుపరుచుకుంది. ఈ జాబితాలో లంక తర్వాత రెండో స్థానంలో బంగ్లాదేశ్ ఉంది. బంగ్లా 26 సార్లు ఆలౌట్ అయింది. న్యూజీలాండ్ (24), పాకిస్తాన్ (20), ఆస్ట్రేలియా (19), వెస్టిండీస్ (19) వరుసగా తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇంగ్లండ్, భారత్ చాలా తక్కువసార్లు టీ20ల్లో ఆలౌట్ అయ్యాయి.

జింబాబ్వే బెటర్:
పసికూన జింబాబ్వే కూడా అగ్ర జట్లు అయిన న్యూజీలాండ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, శ్రీలంక, బంగ్లాదేశ్ కంటే తక్కువ సార్లు ఆలౌట్ అవడం ఇక్కడ విశేషం. గత రెండేళ్లుగా మోస్తరు ప్రదర్శనకే పరిమితమైన లంక జట్టుపై ఆ దేశ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇక ఈ చెత్త రికార్డు చూసి ఆగ్గిలం మీద గుగ్గిలం అవుతున్నారు. ఇలాంటి ప్రదర్శన అవసరమా? అని ఒకరు ట్వీట్ చేయగా.. లంక జట్టుకు పూర్వవైభవం ఎప్పుడు వస్తుందో అని ఇంకొకరు ట్వీట్ చేశారు. న్యూజీలాండ్, ఆస్ట్రేలియా కంటే జింబాబ్వే బెటర్ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

దిగ్గజాలు దూరమవడంతో:
సనత్ జయసూర్య, మహేళ జయవర్ధనే, కుమార సంగక్కర, తిలలరత్నే దిల్షాన్, ఉపుల్ తరంగ, చమింద వాస్, ముత్తయ్య మురళిధరన్, అజంతా మెండిస్, లసిత్ మలింగలు జట్టుకు దూరమవడంతో శ్రీలంక జట్టు బలహీనపడింది. మరికొందరు ఫిక్సింగ్ లాంటి ఉదంతలో ఇరుక్కుపోవడంతో మరింత బలహీనపడింది. దీంతో ఇటీవలి కాలంలో లంక జట్టు వరుస పరాజయాలను ఎదుర్కొంటోంది. ఇది చాలదన్నట్టు వేతనం విషయంలో లంక బోర్డు, ఆటగాళ్ల మధ్య వివాదాలు ఏర్పడ్డాయి. దీంతో స్టార్ ఆటగాళ్లు టీమిండియాతో సిరీస్కు దూరమయ్యారు. ఇన్ని కారణాలతో లంక చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది.

మ్యాచ్ వాయిదా:
లంక పర్యటనలో ఉన్న టీమిండియా ఆల్రౌండర్ కృనాల్ పాండ్యాకు కరోనా వైరస్ సోకింది. దీంతో మంగళవారం జరగాల్సిన భారత్, శ్రీలంక రెండో టీ20 వాయిదా పడింది. ఈ రోజు జరగాల్సిన మ్యాచును బుధవారానికి, గురువారం జరగాల్సిన పోరును శుక్రవారానికి వాయిదా వేస్తారని సమాచారం. లేదా బుధ, గురువారాల్లో రెండు మ్యాచులు ఆడిస్తారని సమాచారం. ప్రస్తుతం ఆటగాళ్లంతా బయో బుడగలోనే ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications