
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్, టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్తో ఈ క్రీడా సంవత్సరం ద్వితీయార్థం ముగిసిపోనుంది. ఇంకొద్ది రోజుల్లో భారత క్రికెట్ జట్టు.. న్యూజిలాండ్తో సిరీస్ ఆడనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. తొలి టెస్ట్ ఆడబోయే జట్టును కూడా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రకటించింది. అజింక్య రహానె సారథ్యంలో తొలి టెస్ట్ మ్యాచ్ను ఆడనుంది టీమిండియా. ఇక ఆసియా కప్ ప్రేక్షకులకు పలకరించబోతోంది.
వచ్చే సంవత్సరం ఆసియా కప్ నిర్వహణకు ఉద్దేశించిన సన్నాహాకాలు మొదలయ్యాయి. శ్రీలంక ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్కు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్, శ్రీలంక జట్లు ఆడబోయే సిరీస్ ఇది. హాంకాంగ్కు కూడా ఈ సారి ప్రవేశం లభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే సంవత్సరం సెప్టెంబర్లో ఆసియా కప్ 2022 నిర్వహణ ఉంటుందని శ్రీలంక క్రికెట్ బోర్డు సూచనప్రాయంగా వెల్లడించింది.
నిజానికి- రొటేషన్ పద్ధతిన ఈ సారి పాకిస్తాన్ ఈ టోర్నమెంట్ను నిర్వహించాల్సి ఉంది. ఆ దేశంలో పర్యటించడానికి ఏ జట్టు కూడా సుముఖతను వ్యక్తం చేయట్లేదు. అక్కడ నెలకొన్న పరిస్థితులు అలాంటివి మరి. ఇదివరకే న్యూజిలాండ్ జట్టు.. పాకిస్తాన్ పర్యటనకు వెళ్లి మరీ వెనక్కి వచ్చేసింది. తమకు భద్రత లేదనే కారణంతో అర్ధాంతరంగా సిరీస్ను రద్దు చేసింది. అప్పట్లో న్యూజిలాండ్ జట్లు ప్లేయర్లు బస చేసిన హోటల్ వద్ద అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని వ్యక్తులు తచ్చాడిన కారణంగా న్యూజిలాండ్ క్రికెటర్లు వెనక్కి వెళ్లిపోయారు.
ఇలాంటి పరిస్థితుల్లో మరే జట్టు కూడా పాకిస్తాన్ పర్యటనకు వెళ్లడానికి సిద్ధంగా ఉండట్లేదు. అందుకే- ఈ సారి ఆసియా కప్ నిర్వహణను శ్రీలంకకు అప్పగించిందంటూ వార్తలు వస్తోన్నాయి. ఆసియా కప్ 15వ ఎడిషన్ ఇది. దీని తరువాత మళ్లీ టీ20 ప్రపంచకప్ 2022 నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం.. గత ఏడాదే టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ను నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. కరోనా వైరస్ వల్ల అది ఈ ఏడాదికి వాయిదా పడింది.
కాగా- ఆసియాకప్ టోర్నమెంట్లో మరోసారి భారత్-పాకిస్తాన్ ఫేస్ టు ఫేస్ తేల్చుకోవడం ఖాయం. ఇదివరకు జరిగిన ఆసియాకప్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా.. బంగ్లాదేశ్ను ఢీ కొట్టింది. ఛాంపియన్గా నిలిచింది. అప్పట్లో పాకిస్తాన్ ఫైనల్స్కు కూడా రాలేకపోయింది. అర్హత సాధించలేకపోయింది. ఈ సారి మాత్రం అప్పట్లా బలహీనంగా కనిపించట్లేదు దాయాది జట్టు. ఈ టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత్కు హైఓల్టేజ్ షాకిచ్చింది. ఈ షాక్ నుంచి టీమిండియా తేరుకోలేకపోయింది. దాని ప్రభావం జట్టు ఆటతీరుపై పడింది.