టీ20 క్రికెట్ అంటే ధనాధన్ బ్యాటింగ్, కళ్లు చెదిరే ఫీల్డింగ్, అబ్దురపరిచే బౌలింగ్ విన్యాసాలే అందరికీ గుర్తొస్తాయి. ఇక టీ20 వరల్డ్ కప్ అంటే ఈ సందడి మరింత ఎక్కువగా ఉంటుంది. ఆటగాళ్లు తమ సర్వశక్తులతో పోరాడుతుంటారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్-2024లో చెత్త రికార్డు నమోదైంది.
ఈ కోరుకోని రికార్డు పసికూన జట్ల మధ్య జరిగిన పోరులో నమోదు కాలేదు. ఫుల్ మెంబర్ టీమ్స్ అయిన శ్రీలంక-దక్షిణాఫ్రికా మ్యాచ్లో చోటు చేసుకుంది. న్యూయార్క్లోని నాసా క్రికెట్ స్టేడియంలో లంక-సౌతాఫ్రికా సోమవారం తలపడ్డాయి. సఫారీ సేన ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 19.1 ఓవర్లలో 77 పరుగులకే ఆలౌటైంది.

ఓపెనర్ కుశాల్ మెండిస్ (19; 30 బంతుల్లో, 1 ఫోర్) టాప్ స్కోరర్. నోకియా నాలుగు వికెట్లతో విజృంభించాడు. నాలుగు ఓవర్లలో కేవలం ఏడు పరుగులే ఇచ్చి కీలక వికెట్ల పడగొట్టాడు. అనంతరం ఛేదనకు వచ్చిన దక్షిణాఫ్రికా స్వల్ప లక్ష్యాన్ని అందుకోవడానికి తీవ్రంగా శ్రమించింది. 16.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించింది.
అయితే ఈ క్రమంలో అరుదైన రికార్డు నమోదైంది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో తక్కువ రన్రేటు నమోదైన మ్యాచ్గా చరిత్రకెక్కింది. ఈ మ్యాచ్లో 4.42 రన్రేటు మాత్రమే నమోదైంది. అంటే ఓవర్కు నాలుగు పరుగుల చొప్పున మాత్రమే ఇరు జట్లు స్కోరు సాధించాయి. ఓవరాల్గా తక్కువ రన్రేటు నమోదైన రెండో టీ20 మ్యాచ్గా శ్రీలంక-దక్షిణాప్రికా పోరు రికార్డులకెక్కింది. 2021లో మీర్పూర్ వేదికగా న్యూజిలాండ్ (60 పరుగులు, 16.5 ఓవర్లు)- బంగ్లాదేశ్ (62 పరుగులు, 15 ఓవర్లు) మ్యాచ్లో 3.83 రన్రేటుతో ముగిసింది.
అంతేగాక శ్రీలంక-సౌతాఫ్రికా మ్యాచ్ మరో చెత్త రికార్డు జాబితాలో చేరింది. ఈ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 127 డాట్ బాల్స్ నమోదయ్యాయి. టీ20ల్లో అత్యంత ఎక్కువ డాట్స్ బాల్స్ నమోదైన రెండో మ్యాచ్ ఇదే. తొలి స్థానంలో 2008లో జరిగిన ఐర్లాండ్-కెన్యా మ్యాచ్ ఉంది. ఈ పోరులో ఏకంగా 148 బంతులకు బ్యాటర్లు పరుగులే చేయలేదు.