|
భారత్ విజయ లక్ష్యం 265
అంతకముందు ఏంజెలో మాథ్యూస్ 128 బంతుల్లో 113(10 ఫోర్లు, 2 సిక్సులు) సెంచరీతో రాణించగా... లాహిరు తిరుమన్నే 68 బంతుల్లో 53(4 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేయడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. దీంతో టీమిండియాకు 265 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు తీయగా... హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసుకున్నారు.
|
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 17 పరుగుల వద్ద శ్రీలంక తొలి వికెట్ కోల్పోయింది. నాలుగో ఓవర్లో ఆ జట్టు కెప్టెన్ దిముత్ కరుణరత్నెను ఔట్ చేసిన బుమ్రా... ఎనిమిదో ఓవర్లో కుశాల్ పెరీరాను ఔట్ చేశాడు. ఈ ఇద్దరూ వికెట్ కీపర్ ధోనికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యారు.
|
17 పరుగులకే తొలి వికెట్
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కుశాల్ మెండీస్ ఆదుకునే ప్రయత్నం చేయగా రవీంద్ర జడేజా బంతి అందుకున్న తొలి ఓవర్లోనే కుశాల్ మెండిస్(3)ను పెవిలియన్ పంపాడు. జడేజా వేసిన 11వ ఓవర్ నాలుగో బంతిని ముందుకొచ్చి ఆడేందుకు కుశాల్ యత్నించగా ధోని స్టంపౌట్ చేశాడు. దీంతో 53 పరుగులకే శ్రీలంక మూడు కీలక వికెట్లు కోల్పోయింది.
|
55 పరుగులకే 4 వికెట్లు
ఆ తర్వాత రెండు పరుగులకే అవిష్క ఫెర్నాండో(20)ను హార్దిక్ పాండ్యా ఔట్ చేశాడు. దీంతో 55 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన శ్రీలంకను ఏంజెలో మాథ్యూస్-లాహిరు తిరుమన్నెల జోడీ ఆదుకుంది. వీరిద్దరూ ఆచితూడి ఆడుతూ ఐదో వికెట్కు వంద పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
|
లాహిరు తిరుమన్నే హాఫ్ సెంచరీ
ఈ క్రమంలో ఏంజెలో మాథ్యూస్ 76 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో మాథ్యూస్ హాఫ్ సెంచరీ సాధించగా... ఆ తర్వాత 66 బంతుల్లో 4 పోర్ల సాయంతో తిరుమన్నే సైతం హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. హాఫ్ సెంచరీ అనంతరం దూకుడుగా ఆడే క్రమంలో జట్టు స్కోరు 179 పరుగుల వద్ద లాహిరు తిరుమన్నే కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో జడేజాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
|
ప్రపంచకప్లో ఇదే తొలి సెంచరీ
దీంతో వీరిద్దరి భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన ధనుంజయ డి సెల్వాతో కలిసి ఏంజెలో మాథ్యూస్ లంక ఇన్నింగ్స్ని నడిపించాడు. ఈ క్రమంలో 115 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో సెంచరీ సాధించాడు. ఏంజెలో మాథ్యూస్కు ప్రపంచకప్లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం.
|
7 వికెట్లు కోల్పోయి 264 పరుగులు
76 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మాథ్యూస్ తర్వాత వేగంగా ఆడాడు. బాధ్యతాయుత ఇన్నింగ్స్తో రాణించి శ్రీలంకను మెరుగైన స్థితిలో నిలిపాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ధనుంజయ డి సెల్వా (29), తిషారా పెరీరా(2) స్వప్ల స్కోర్లకే పరిమితం కావడంతో శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది.