నవ్వులే నవ్వులు:
సిరీస్ ఆరంభం అయ్యేలోపు జట్టులోని ఆటగాళ్ల మధ్య బంధం పెంచేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇలా చేస్తోంది. క్రికెటర్లను ఒక్క దగ్గరకు చేర్చి వారితో ఉల్లాసవంతమైన క్రీడలు ఆడిస్తోంది. ఇందుకు సంబంధించిన చిత్రాలను బీసీసీఐ ట్విటర్లో పంచుకుంది. 'క్వారంటైన్ నుంచి బయటకొచ్చిన ఆనందంలో.. నవ్వులే నవ్వులు. త్వరలోనే మరో సరదా వీడియో రాబోతోంది' అని కామెంట్ పెట్టింది. లంక సిరీస్ కోసం చాల మంది యువ ఆటగాళ్లు ఎంపికయిన విషయం తెలిసిందే. అందుకే సీనియర్లతో వారికి అనుబంధం ఏర్పడేలా చేస్తోంది.

3 నుంచి నుంచి సిరీస్ ఆరంభం:
టీమిండియా తొలిసారి రెండు దేశాల్లో వేర్వేరు జట్లతో తలపడుతున్న సంగతి తెలిసిందే. సీనియర్లతో కూడిన జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉండగా.. యువకులతో కూడిన జట్టు శ్రీలంకకు వెళ్లింది. భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ లంకకు వెళ్లిన బృందానికి కోచ్గా ఉన్నాడు. ఇక శిఖర్ ధావన్ కెప్టెన్, భువనేశ్వర్ కుమార్ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు. జులై 13 నుంచి పరిమిత ఓవర్ల సిరీస్ ఆరంభం కాబోతోంది. ఆతిథ్య జట్టుతో భారత్ 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది.

స్వాగతాలు లేవు:
ముంబైలోని ఓ హోటల్లో 14 రోజులు క్వారంటైన్లో ఉన్న భారత జట్టు.. అక్కడి నుంచి నేరుగా స్పెషల్ ప్లైట్లో కొలంబోకి చేరుకుంది. 20 మందితో కూడిన భారత్ జట్టు కొలంబోకి చేరుకోగా.. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో జట్టుకి ఎలాంటి స్వాగతాల్ని శ్రీలంక క్రికెట్ బోర్డు ఏర్పాటు చేయలేదు. సాధారణంగా లంక టూర్లో టీమ్కి హోటల్లో సంప్రదాయ ప్రకారం స్వాగతాలు ఏర్పాటు చేసేవారు. కానీ కరోనా కారణంగా అవేమీ భారత జట్టుకు దక్కలేదు. ప్లైట్ దిగగానే ధావన్ సేన నేరుగా హోటల్కు చేరుకుంది. హోటల్ సిబ్బంది కూడా ఆటగాళ్లను పలకరించలేదు.
భారత జట్టు:
శిఖర్ ధావన్, పృథ్వీ షా, దేవ్దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీష్ పాండే, హార్దిక్ పాండ్యా, నితీష్ రాణా, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, యజువేంద్ర చహల్, రాహుల్ చహర్, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, వరున్ చక్రవర్తి, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, నవ్దీప్ సైనీ, చేతన్ సకారియా.


Click it and Unblock the Notifications












