
కొలంబో: బంగ్లాదేశ్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ను మరో మ్యాచ్ ఉండగానే శ్రీలంక కైవసం చేసుకుంది. ఆదివారం కొలంబోలోని ప్రేమదాస మైదానంలో జరిగిన రెండో వన్డేలో లంక 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో ఆతిథ్య లంక 2-0తో ఆధిక్యంలోకి వెళ్లి సిరీస్ దక్కించుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 8 వికెట్లకు 238 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీమ్ (98 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), మెహదీ హసన్ (43) రాణించారు. 117 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన కష్టాల్లో పడిన బంగ్లాను మెహదీ హసన్తో కలిసి ఏడో వికెట్కు 84 పరుగులు జోడించాడు. దీంతో లంక సాధారణ స్కోర్ చేసింది. లంక బౌలర్లలో ప్రదీప్, ఉడాన, ధనుంజయ తలో రెండు వికెట్లు తీశారు.
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7 ప్రత్యేక వార్తల కోసం
లక్ష్య ఛేదనలో లంక 44.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 242 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ కరుణరత్నే (15) విఫలమయినా.. ఓపెనర్ అవిష్క ఫెర్నాండో (75 బంతుల్లో 82; 9 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. కుశాల్ పెరీరా (30), కుశాల్ మెండిస్ (41 నాటౌట్) పరుగులు చేయగా.. మాథ్యూస్ (57 బంతుల్లో 52 నాటౌట్; 7 ఫోర్లు) అర్ధ శతకం చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్ రహమాన్ రెండు వికెట్లు తీసాడు. 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవిష్క ఫెర్నాండోకు దక్కింది. ఆఖరి వన్డే బుధవారం జరుగుతుంది.

శ్రీలంక స్టార్ పేసర్ లసిత్ మలింగ శుక్రవారం తన తుది వన్డే ఆడాడు. బంగ్లాదేశ్తో జరిగిన తొలి వన్డేలో లంక 91 పరుగుల తేడాతో విజయం సాధించి వెటరన్ పేసర్ మలింగకు ఘనంగా వీడ్కోలు పలికింది. 2011లో టెస్టులకు వీడ్కోలు చెప్పిన మలింగ.. ఇటీవలే వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక మలింగ టీ20లకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాడు. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ వరకు యార్కర్ల కింగ్ ఆడనున్నాడు. చివరి మ్యాచ్లో మలింగ (9.4-2-38-3) అద్భుత ప్రదర్శన చేసాడు. బంగ్లా ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్.. ముస్తాఫిజుర్ రెహమాన్ వికెట్లను పడగొట్టాడు. వన్డే కెరీర్ చివరి బంతికి కూడా వికెట్ తీయడం విశేషం. మ్యాచ్ అనంతరం లంక ఆటగాళ్లు ఘనంగా వీడ్కోలు పలికారు.