సాధారణంగా వర్షం కారణంగా క్రికెట్ మ్యాచ్లు ఆగిపోతుంటాయి. కొన్ని సార్లు సరైన వెలుతురు లేక ఆట నిలిచిపోతుంటుంది. అయితే శ్రీలంక -అఫ్గానిస్థాన్ మధ్య జరుగుతున్న ఏకైక టెస్టుకు ఓ ఉడుమ అంతరాయం కలిగించింది. ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడటం కోసం లంక పర్యటనకు అఫ్గానిస్థాన్ ఇటీవల వచ్చిన సంగతి తెలిసిందే. షెడ్యూల్లో భాగంగా శుక్రవారం నుంచి కొలంబో వేదికగా ఏకైక టెస్టు ప్రారంభమైంది.
అయితే రెండో రోజు ఆటలో శ్రీలంక ఇన్నింగ్స్ 48వ ఓవర్లో ఒక ఉడుమ బౌండరీ లైన్ను దాటి మైదానంలోకి వచ్చింది. బౌండరీ లైన్ వెంబడి పాకుతూ గ్రౌండ్లో సందడి చేసింది. దీంతో అంపైర్లను మ్యాచ్ను కాసేపు నిలిపివేశారు. మైదాన సిబ్బంది వచ్చి ఉడుమును గ్రౌండ్ అవతలకు పంపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. కాగా, గతంలో శ్రీలంక నిర్వహించిన ఓ మ్యాచ్లో పాము వల్ల కూడా ఆట కాసేపు ఆగిపోయింది.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు వచ్చిన అఫ్గానిస్థాన్ మొదటి ఇన్నింగ్స్లో 198 పరుగులకు ఆలౌటైంది. రహ్మత్ షా (91; 139 బంతుల్లో) గొప్పగా పోరాడాడు. సహచరులు సహకారం ఇవ్వకపోయినా స్కోరుబోర్డు ముందుకు నడిపించాడు. కానీ త్రుటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. నూర్ అలీ జద్రాన్ (31; 46 బంతుల్లో), అలిఖిల్ (21; 50 బంతుల్లో), కైస్ అహ్మద్ (21; 44 బంతుల్లో) పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో విశ్వ ఫెర్నాండో నాలుగు వికెట్లు, అశిత ఫెర్నాండో, ప్రభత్ జయసూర్య చెరో మూడు వికెట్లు తీశారు.
అనంతరం బ్యాటింగ్కు వచ్చిన శ్రీలంక భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. మధుష్క (37; 73 బంతుల్లో), కరుణరత్నె ( 77; 72 బంతుల్లో) తొలి వికెట్కు 93 పరుగులు జోడించారు. వన్డౌన్లో వచ్చిన కుశాల్ మెండిస్ (10; 22 బంతుల్లో) విఫలమయ్యాడు. దీంతో లంక 148 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన ఏంజెలో మాథ్యూస్ (109*; 199 బంతుల్లో), దినేశ్ చండిమల్ (90*; 158 బంతుల్లో) ఇన్నింగ్స్ చక్కదిద్దారు. నాలుగో వికెట్కు అభేద్యమైన 191 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం అఫ్గాన్ కంటే లంక 142 పరుగుల ఆధిక్యంలో ఉంది.