హోబర్ట్: ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా హోబర్ట్ మైదానంలో బుధవారం స్కాట్లాండ్తో జరిగిన మ్యాచులో శ్రీలంక 148 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక దిల్షాన్ (104), సంగక్కర (124) శతకాలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 363 పరుగులు చేసింది.
లక్ష్య ఛేదనలో తడపబడిన స్కాట్లాండ్ 43.1 ఓవర్లలో 215 పరుగులకే ఆలౌటైంది. కొలెమన్ 70, మొమ్సెన్ 60 పరుగులతో రాణించారు. వీరిద్దరూ మినహా మిగితా బ్యాట్స్మెన్లు పరుగులు తీయడంలో విఫమయ్యారు. దీంతో 148 పరుగుల భారీ తేడాతో స్కాట్లాండ్ పరాజయం పాలైంది.

శ్రీలంక బౌలర్లలో కులశేఖర, చమీర మూడేసి వికెట్లు పడగొట్టారు. మలింగ 2, పెరీరా, దిల్షాన్ చెరో వికెట్ తీశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక 9 వికెట్లు నష్టపోయి 363 పరుగులు చేసింది. దిల్షాన్, సంగక్కర సెంచరీలతో చెలరేగి శ్రీలంక విజయంలో కీలక పాత్ర పోషించారు.
కాగా, ఈ విజయంతో శ్రీలంక జట్టు గ్రూప్-ఏలో రెండో స్థానానికి చేరుకుంది. సంగక్కర 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. సంగక్కర ఈ మ్యాచులో సెంచరీ చేయడం ద్వారా వరుసగా నాలుగు సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. శ్రీలంక ఆడిన గత మూడు మ్యాచుల్లో కూడా సంగక్కర సెంచరీలు నమోదు చేశాడు.