హైదరాబాద్: నిబంధన ఉల్లంఘించిన శ్రీలంక యువ క్రికెటర్ ధనుష్క గుణతిలకపై ఆ దేశ క్రికెట్ బోర్డు సస్పెన్షన్ వేటు వేసింది. ప్రాక్టీస్ సెషన్ను ఎగ్గొట్టడంతో పాటు రాత్రివేళ జరిగిన పార్టీ సెషన్లో ఎక్కువ సయయాన్ని గడిపినట్లు గుర్తించడంతో అతనిపై ఆరు మ్యాచ్ల నిషేధంతో పాటు అతని కాంట్రాక్టులో 20 శాతం కోత విధించారు.
మైదానం బయట గుణతిలక ప్రవర్తనను పరిగణలోకి తీసుకొని అతడిని సస్పెండ్ చేసినట్లు శ్రీలంక బోర్డు అధికారులు తెలిపారు. ఈ నిషేధం సెప్టెంబర్ 30 నుంచే అమల్లోకి వస్తుందని బోర్టు పేర్కొంది. రెండు నెలల క్రితం అందిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపించిన బోర్డు తాజాగా అతనిపై చర్యలు తీసుకుంది.
ఇటీవల భారత్తో ముగిసిన టెస్టు, వన్డే సిరీస్ సమయంలో ఓ మ్యాచ్ ఆడేందుకు స్టేడియంలోకి కిట్బ్యాగ్ లేకుండా గుణతిలక రావడాన్ని అప్పట్లో శ్రీలంక జట్టు మేనేజ్మెంట్ సీరియస్గా తీసుకుంది. దీనిని గుర్తించిన శ్రీలంక క్రికెట్ బోర్డు తాజాగా 6 మ్యాచుల నిషేధాన్ని విధిస్తూ చర్యలు తీసుకుంది.
'జట్టు మేనేజ్మెంట్ గుణతిలక క్రమశిక్షణ తప్పాడంటూ శ్రీలంక క్రికెట్ బోర్డుకి ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన బోర్డు అతనిపై ఆరు మ్యాచ్ల నిషేధం విధించింది' అని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. ఈ ఏడాది జులైలో భారత్తో జరిగిన టెస్టు సిరీస్తో గుణతిలక అరంగేట్రం చేశాడు.
అనంతరం ఐదు వన్డేలకు ఎంపికైన గుణతిలక రెండు వన్డేల తర్వాత గాయంతో దూరమయ్యాడు. ప్రస్తుతం శ్రీలంక జట్టు దుబాయిలో పాకిస్థాన్తో టెస్టు సిరీస్ ఆడుతోంది. ఈ టెస్టు జట్టులో కూడా గుణతిలక చోటు దక్కించు కోలేకపోయాడు. తొలి టెస్టులో శ్రీలంక విజయం సాధించగా రెండో టెస్టు శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది.