
కొలొంబో: సరైన సాక్ష్యాలు లేనందున శ్రీలంక క్రీడా మంత్రిత్వ శాఖ 2011 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై దర్యాప్తును నిలిపివేసింది. మాజీ కెప్టెన్లు కుమార సంగక్కర, మహేల జయవర్ధనే, అరవింద డి సిల్వాలను విడివిడిగా కొన్ని గంటల పాటు ప్రశ్నించిన శ్రీలంక క్రీడా మంత్రిత్వ శాఖ ప్రత్యేక దర్యాప్తు విభాగం శుక్రవారం దర్యాప్తును నిలిపివేసింది. ఈ విషయాన్ని లంకకు చెందిన ఓ న్యూస్ పోర్టల్ ప్రకటించింది.
క్రీడా మంత్రిత్వ శాఖ దర్యాప్తును నిలిపివేస్తున్నట్లు మాజీ శ్రీలంక ఫస్ట్ క్లాస్ క్రికెటర్, అంతర్జాతీయ క్రికెట్ వ్యాఖ్యాత రోషన్ అబీసింగే కూడా ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. 'సరైన ఆధారాలు లేనందున శ్రీలంక క్రీడా మంత్రిత్వ శాఖ 2011 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై దర్యాప్తును నిలిపివేసింది' అని రాసుకొచ్చారు. 2011 ప్రపంచకప్ ఫైనల్ ఫిక్సింగ్ వ్యవహారం ప్రస్తుతం శ్రీలంకలో రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది.
భారత్తో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంక అమ్ముడుపోయిందని ఆ దేశ మాజీ క్రీడాశాఖమంత్రి అలుత్గమాగే మహిందానంద చేసిన ఆరోపణలను సీరియస్గా తీసుకున్న లంక ప్రభుత్వం విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. పూర్తి స్థాయి విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు విభాగాన్ని ఏర్పాటు చేసింది. మొదటగా మహిందానందను విచారించిన దర్యాప్తు విభాగం అతని స్టేట్మెంట్ను రికార్డు చేయగా.. తన వద్ద ఫిక్సింగ్కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని, తాను కేవలం అనుమానంతో మాత్రమే ఆ వ్యాఖ్యలు చేసినట్లు వెల్లడించాడు.
ఆ తర్వాత 2011 ప్రపంచకప్ టీమ్ను ఎంపిక చేసిన చీఫ్ సెలక్టర్ అరవింద డిసిల్వాను.. ఆ మ్యాచ్లో ఆడిన ఓపెనర్ ఉపుల్ తరంగాలను శ్రీలంక క్రీడా మంత్రిత్వ శాఖ ప్రత్యేక దర్యాప్తు విభాగం గంటల పాటు విచారించింది. గురువారం అప్పటి శ్రీలంక జట్టు కెప్టెన్ కుమార సంగక్కరను సుమారు 10 గంటల పాటు విచారించింది. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్లో రెండు సార్లు టాస్ వేయడంపై గల కారణాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన సంగక్కర.. నిజనిజాలు త్వరలోనే వెలుగు చూస్తాయని చెప్పి వెళ్లిపోయాడు.
శ్రీలంక క్రీడా మంత్రిత్వ శాఖ ప్రత్యేక దర్యాప్తు విభాగం చివరగా శుక్రవారం ఫైనల్లో సెంచరీ చేసిన మహేల జయవర్ధనే స్టేట్మెంట్ను కూడా తీసుకుంది. కొలంబోలోని సుగదాదాసా స్టేడియంలో దర్యాప్తు జరిగింది. అందరూ ఇక్కడకు వచ్చి విచారణకు హాజరయ్యారు. ముగ్గురు మాజీ కెప్టెన్లను ప్రశ్నించిన అనంతరం సరైన సాక్ష్యాలు లేనందున 2011 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై దర్యాప్తును నిలిపివేస్తున్నట్లు ప్రత్యేక దర్యాప్తు విభాగం ప్రకటించింది.