హైదరాబాద్: తాజాగా వెస్టిండీస్-శ్రీలంక మధ్య రెండో టెస్టు సందర్భంగా 'టాంపరింగ్' మళ్లీ చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో శ్రీలంకపై బాల్ టాంపరింగ్ ఆరోపణలు రావడంతో ఆ జట్టు ఆగ్రహాంతో మూడో రోజు మైదానంలో దిగడానికి నిరాకరించింది. దీంతో ఆట రెండు గంటలు ఆలస్యంగా మొదలైంది. రెండో రోజు ఆట ముగిశాక బంతి ఆకారం దెబ్బ తిన్నట్లు భావించిన అంఫైర్లు.. శనివారం బంతిని మార్చాలని నిర్ణయించారు.
దీనికి లంక కెప్టెన్ దినేశ్ చండిమాల్ అభ్యంతరం వ్యక్తం చేసి, మైదానంలోకి రావడానికి నిరాకరించారు. మ్యాచ్ రిఫరీ శ్రీనాథ్తో చర్చల అనంతరం లంక జట్టు మైదానంలోకి అడుగుపెట్టింది. ఐతే లంక బౌలింగ్ సందర్భంగా బంతి ఆకారం దెబ్బ తిన్నందుకు అంఫైర్లు విండీస్కు ఐదు పెనాల్టీ పరుగులిచ్చారు. మళ్లీ లంకేయులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో మరోసారి మ్యాచ్ రిఫరీ కలిగించుకోని గొడవ సద్దుమణిగేలా చేశాడు.
అయితే ఈ విషయమై తాజాగా ఐసీసీ శ్రీలంక కెప్టెన్ దినేశ్ చండీమాల్పై ఐసీసీ నిబంధన లెవల్ 2.2.9 కింద చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే ఈ నిబంధన ప్రకారం బంతి ఆకారాన్ని మార్చే ప్రయత్నం జరిగినట్లే. ఒకవేళ అదే నిజం అయితే చండిమాల్ మ్యాచ్ ఫీజులో 75శాతం కోత విధిస్తారు. దీంతో అతని ఖాతాలో మూడు డీమెరిట్ పాయింట్లు వచ్చి చేరతాయి.
దీంతో లంకేయులు మరోసారి మ్యాచ్ ఆడేందుకు నిరాకరించారు. మళ్లీ శ్రీనాథ్ జోక్యం చేసుకొని మ్యాచ్ జరిగేలా చూశారు. తొలి ఇన్నింగ్స్లో శ్రీలంక 253 పరుగులు చేయగా.. వెస్టిండీస్ 300 పరుగులు సాధించింది. మూడో రోజు ఆట ముగిసేసమయానికి రెండో ఇన్నింగ్స్లో శ్రీలంక 34/1తో ఉంది.