ఆసియా కప్ 2025లో భాగంగా నువాన్ తుషారా అద్భుతమైన బౌలింగ్ , ఆ తర్వాత కుశాల్ మెండిస్ అద్భుతమైన అర్ధ సెంచరీతో శ్రీలంక 6 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ను ఓడించింది. ఈ విజయంతో, ఆసియా కప్లో శ్రీలంక సూపర్-4లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ ఓటమి బంగ్లాదేశ్కు ప్రయోజనం చేకూర్చింది. బంగ్లాదేశ్ కూడా ఇప్పుడు సూపర్-4కు అర్హత సాధించింది. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో, ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది.
ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. అఫ్గానిస్తాన్ బ్యాటర్ మహమ్మద్ నబీ ఆఖరి ఓవర్లో వీరవిహారం చేశాడు. తన అనుభవాన్ని రంగరించి, వరుస సిక్సర్లతో జట్టు స్కోరును అమాంతం పెంచాడు. అయితే, ఆఫ్ఘన్ బౌలర్లు ఈ స్కోరును కాపాడుకోలేకపోయారు. శ్రీలంక 18.4 ఓవర్లలో 171 పరుగులు చేసి మ్యాచ్ను గెలుచుకుంది.

శ్రీలంక విజయానికి కుశాల్ మెండిస్ హీరోగా నిలిచాడు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కుశాల్ మెండిస్ హీరో. మెండిస్ 52 బంతుల్లో 74 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్లో 10 ఫోర్లు కూడా బాదాడు. మెండిస్తో పాటు శ్రీలంక తరపున కుశాల్ పెరీరా కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. పెరీరా 20 బంతుల్లో 28 పరుగులు చేయగా, చరిత్ అసలంక 12 బంతుల్లో 17 పరుగులతో ఆఫ్ఘనిస్తాన్ ఆశలను దెబ్బతీశాడు. చివరికి, కమిందు మెండిస్ కూడా 13 బంతుల్లో 26 పరుగులు చేశాడు.
తేలిపోయిన ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్
ఆఫ్ఘనిస్తాన్ జట్టు స్పిన్ బౌలింగ్కు ప్రసిద్ధి చెందింది. కానీ ఈ డూ-ఆర్-డై మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ తేలిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ తరపున ముజీబ్ ఉర్ రెహమాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, నూర్ అహ్మద్ తలో వికెట్ తీసుకున్నారు. అదే సమయంలో కెప్టెన్ రషీద్ ఖాన్ తన నాలుగు ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి వికెట్ తీసుకోకుండానే వెనుదిరిగాడు.
మహ్మద్ నబీ అర్ధశతకం వృథా
ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ పేలవంగా ప్రారంభమైంది. జట్టు కేవలం 71 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. అయితే, కెప్టెన్ రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ బాధ్యత తీసుకుని చివరి ఓవర్లలో బలంగా బ్యాటింగ్ చేశారు. రషీద్ ఖాన్ 23 బంతుల్లో 24 పరుగులు చేశాడు. అదనంగా, నబీ 22 బంతుల్లో 60 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్లో, నబీ ఆరు సిక్సర్లు, మూడు ఫోర్లు కూడా బాదాడు. అయితే, నబీ విధ్వంసక అర్ధశతకం వృధా అయింది.
సూపర్-4లో చోటు సంపాదించిన జట్లు:
ఈ ఫలితంతో గ్రూప్-బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ సూపర్-4కు క్వాలిఫై అయ్యాయి. గ్రూప్-ఎ నుంచి ఇప్పటికే భారత్, పాకిస్థాన్ అర్హత సాధించాయి.
గ్రూప్-ఎ: భారత్, పాకిస్థాన్
గ్రూప్-బి: శ్రీలంక, బంగ్లాదేశ్