
కొలొంబో: శ్రీలంక సీనియర్ ఆటగాడు ఉపుల్ తరంగ మంగళవారం అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తన 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ నేటితో ముగిసిందంటూ ట్విటర్ ద్వారా తరంగ తెలిపాడు. 'నేను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నా' అని ట్విటర్లో పోస్ట్ చేశాడు. 2019 మార్చిలో శ్రీలంక తరఫున తరంగ చివరి మ్యాచ్ ఆడాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మన్ అయిన తరంగ లంకకు ఓపెనర్గా, వికెట్ కీపర్గా సేవలందించాడు. అప్పట్లో లంక దిగ్గజం తిలకరత్నే దిల్షాన్తో కలిసి తరంగ ఓపెనింగ్ చేసేవాడు.
'నా ప్రియమైన స్నేహితులారా.. మంచి విషయాలు ఎప్పటికైనా ముగియాల్సిందే. నా అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైందని నేను నమ్ముతున్నా. కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా. 16 ఏళ్ల పాటు లంక్ క్రికెట్కు సేవలందించడం గొప్ప అనుభూతి. ఈ 16 ఏళ్లలో జట్టుతో ఎన్నో జ్ఞాపకాలతో పాటు మంచి స్నేహితులు ఎందరో దొరికారు. విఫలమైన ప్రతీసారి నాపై ఉన్న నమ్మకంతో అవకాశాలు ఇచ్చిన లంక్ క్రికెట్ బోర్డుకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా' అని తరంగ పేర్కొన్నాడు.
'ఇన్నేళ్ల పాటు నాకు మద్దతునిచ్చిన అభిమానులకు, కష్టకాలంలో నాకు తోడుగా ఉన్న కుటుంబ సభ్యులకు ఎంతో రుణపడి ఉన్నా. మీరిచ్చిన ఆశీర్వాదంతోనే ఇంతకాలం క్రికెట్ను ఆడగలిగా. థ్యాంక్యూ ఫర్ ఎవ్రీథింగ్. శ్రీలంక క్రికెట్ భవిష్యత్తులో మరింత బాగుండాలని కోరుకుంటున్నా. త్వరలో లంక జట్టు బలంగా బౌన్స్ అవుతుందని నేను ఆశిస్తున్నా. అందరికి ధన్యవాదాలు' అని ఉపుల్ తరంగ ట్విటర్ ద్వారా తన భావోద్వేగాన్ని పంచుకున్నాడు.
2005లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఉపుల్ తరంగ 31 టెస్టుల్లో 1754 పరుగులు, 235 వన్డేల్లో 6951 పరుగులు, 26 టీ20ల్లో 407 పరుగులు చేశాడు. వన్డేల్లో 15 సెంచరీలు, 37 హాఫ్ సెంచరీలు చేసిన తరంగ.. టెస్టుల్లో 3 సెంచరీలు, 8 అర్థ శతకాలు బాదాడు. 2007, 2011 ప్రపంచకప్లలో తరంగ శ్రీలంక జట్టు సభ్యుడిగా ఉన్నాడు. 2006లో ఇంగ్లండ్ టూర్లో వన్డే సిరీస్ను 5-0 తేడాతో వైట్వాష్ చేయడంలో తరంగ కీలకపాత్ర పోషించాడు. సనత్ జయసూర్యతో కలిసి తరంగ వన్డే ఓపెనింగ్ రికార్డు భాగస్వామ్యం సాధించడంతో పాటు 102 బంతుల్లో 109 పరుగులు చేసి స్టార్ అయ్యాడు.