సిరీస్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో శ్రీలంక సత్తాచాటింది. దంబుల్లా వేదికగా వెస్టిండీస్తో జరిగిన రెండో టీ20లో 73 పరుగల తేడాతో ఘన విజయం సాధించింది. ఆల్రౌండ్ షోతో అదరగొట్టి మూడు టీ20ల సిరీస్ను 1-1తో సమం చేసింది. నిర్ణయాత్మక ఆఖరి టీ20 గురువారం జరగనుంది. తొలి టీ20లో విండీస్ అయిదు వికెట్ల తేడాతో నెగ్గిన సంగతి తెలిసిందే.
మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 162 పరుగులు చేసింది. ఓపెనర్ పాథుమ్ నిస్సాంక (54; 49 బంతుల్లో, 9 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధశతకం సాధించాడు. కుశాల్ మెండిస్ (26; 25 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్), కుశాల్ పెరీరా (24; 16 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్) పరుగులు చేశారు. షెఫార్డ్ రెండు వికెట్లు, షామర్ స్ప్రింగర్, షామర్ జోసెఫ్, అల్జారీ జోసెఫ్ తలో వికెట్ తీశారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంకకు శుభారంభం దక్కింది. నిస్సాంక, మెండిస్ దూకుడుగా ఆడటంతో పవర్ప్లేలో 52 పరుగులు సాధించింది. వన్డౌన్లో వచ్చిన కుశాల్ పెరీరా కూడా రాణించడంతో శ్రీలంక భారీ స్కోరు దిశగా పయనించింది. కానీ విండీస్ బౌలర్లు పుంజుకుని క్రమం తప్పకుండా వికెట్లు తీసి స్కోరును కాస్త కట్టడిచేశారు. అనంతరం ఛేదనకు దిగిన వెస్టిండీస్ 16.1 ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలింది. హిట్టర్లు అట్టర్ ఫ్లాప్ అయ్యారు.

కెప్టెన్ రోమన్ పావెల్ (20; 17 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్), అల్జారీ జోసెఫ్ (16; 10 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్), రూథర్ఫర్డ్ (14; 16 బంతుల్లో, 2 ఫోర్లు) మినహా ఎవరూ రెండంకెల స్కోరు సాధించలేదు. లంక బౌలర్లలో దునిత్ వెల్లలాగె మూడు వికెట్లు పడగొట్టాడు. నాలుగు ఓవర్లలో 9 పరుగులే ఇచ్చి కీలక వికెట్లు తీశాడు. అసలంక, హసరంగ, తీక్షణ తలో రెండు వికెట్లు తీశారు. పతిరనా ఒక్క వికెట్ తీశాడు.