గాలే: శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ దిల్రువాన్ పెరెరా దెబ్బకు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు విలవిలలాడింది. ఆస్ట్రేలియాపై శ్రీలంక 2-0 స్కోరుతో చారిత్రాత్మక విజయం సాధించింది. గాలేలో జరిగిన రెండో టెస్టు మ్యాచులో ఆస్ట్రేలియా 229 పరుగుల తేడాతో శ్రీలంక చేతిలో చావుదెబ్బ తింది.
టెస్టు మ్యాచు మూడు రోజుల్లోనే ముగిసింది. శ్రీలంక తన ముందు ఉంచిన 413 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శనివారంనాడు లంచ్ విరామం తర్వాత ఆస్ట్రేలియా 183 పరుగులకే తోక ముడిచింది. ఆస్ట్రేలియాపై శ్రీలంక గతంలో 1999లో విజయం సాధించింది. ఇప్పటి వరకు ఆసీస్ నుంచి సిరీస్ కైవసం చేసుకున్న దాఖలాలు లేవు.

మూడు మ్యాచుల టెస్టు సిరీస్ను శ్రీలంక మరో మ్యాచు మిగిలి ఉండగానే 2-0 స్కోరుతో గెలుచుకుంది. శ్రీలంక సీనియర్ స్పిన్నర్ రంగన హెరాత్ తొలి ఇన్నింగ్సులో హ్యాట్రిక్ సాధించాడు. టెస్టు క్రికెట్లో అతనికి ఇదే తొలి హ్యాట్రిక్. దాంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 106 పరుగులకే ముగిసింది. ఆస్ట్రేలియా ఓ ఇన్నింగ్సులో ఇంత తక్కువ స్కోరు సాధించడం ఇదే తొలి సారి.
రెండో ఇన్నింగ్సులో పెరెరా ఆస్ట్రేలియా వెన్ను విరిచాడు. 70 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీశాడు. దీంతో ఆసీస్ ఇన్నింగ్సు 50.1 ఓవర్లలోనే ముగిసింది. శ్రీలంక బౌలర్లను ప్రతిఘటించడానికి కెప్టెన్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ కాస్తా ప్రయత్నించారు. నాలుగో వికెట్ భాగస్వామ్యానికి వారు 51 పరుగులు చేశారు. అయితే వారిద్దరిని కూడా పెరెరా పెవిలియన్కు పంపించాడు. పల్లెకెలెలో జరిగిన తొలి టెస్టు మ్యాచులో శ్రీలంక కంగారూలపై 106 పరుగుల తేడాతో విజయం సాధించింది.