
అన్ని మ్యాచ్లు ప్రేమదాస స్టేడియంలోనే
ఈ ముక్కోణపు సిరిస్లో భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ దేశాల మధ్య జరగనుంది. మార్చి 8న ప్రారంభమయ్యే ఈ సిరీస్ 20తో ముగియనుంది. ఈ టోర్నీకి 'నిదహాస్ ట్రోఫీ 2018'గా నామకరణం చేశారు. ఈటోర్నీలో భాగంగా జరిగే మ్యాచ్లన్నీ శ్రీలంక రాజధాని కొలంబోలో ఉన్న ప్రేమదాస స్టేడియంలో జరగనున్నాయి.

దేని కోసం ఈ ముక్కోణపు సిరిస్?
వచ్చే ఏడాదితో శ్రీలంకకు స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు పూర్తి కానుంది. ఇందులో భాగంగా తమ దేశంలో ముక్కోణపు సిరీస్ ఆడాలంటూ అటు బీసీసీఐ, ఇటు బంగ్లాదేశ్ బోర్డులతో శ్రీలంక క్రికెట్ బోర్డు సంప్రదింపులు జరిపింది.

శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన
దీనికి ఇరు దేశాలకు చెందిన బోర్డులు అంగీకరించడంతో 2018 మార్చి 8 నుంచి 20 మధ్య ముక్కోణపు సిరిస్ నిర్వహిస్తున్నట్లు శుక్రవారం శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన చేసింది. ఈ మ్యాచ్లన్నీ రాత్రి 7 గంటలకు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. 'టోర్నీలో భాగంగా ప్రతి జట్టు మిగతా రెండు జట్లతో రెండేసి మ్యాచ్లు ఆడతుంది. మార్చి 20న ఫైనల్ జరగనుంది. అన్ని మ్యాచ్లు సాయంత్రం 7గంటలకు ప్రారంభమవుతాయి. పూర్తిస్థాయి షెడ్యూల్ను త్వరలో ప్రకటిస్తాం' అని లంక బోర్డు ప్రతినిధి ఒకరు తెలిపారు.

దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న కోహ్లీసేన
కాగా, ప్రస్తుతం శ్రీలంక మూడు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ కోసం భారత్ పర్యటనకు వచ్చింది. ఇరు జట్ల మధ్య తొలి టెస్టు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా గురువారం (నవంబర్ 16)న మొదలైంది. ఈ సిరీస్ అనంతరం కోహ్లీసేన దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. డిసెంబరు 30 నుంచి ఫిబ్రవరి 24 వరకు జరగనున్న ఈ పర్యటనలో టీమిండియా... దక్షిణాఫ్రికా జట్టుతో 3 టెస్టులు, 6 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది.


Click it and Unblock the Notifications











