
కొలంబో: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా భారత్-శ్రీలంక సిరీస్పై నెలకొన్న సందిగ్దత వీడింది. షెడ్యూల్ ప్రకారమే వన్డే, టీ20 సిరీస్ జరగనుంది. తాజాగా నిర్వహించిన కరోనా టెస్టుల్లో శ్రీలంక క్రికెటర్లందరికి నెగటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో జూన్ 13న కొలంబో వేదికగా ఇరు జట్ల మధ్య తొలి వన్డే యధావిధిగా జరగనుంది. శ్రీలంక జట్టు బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్కు కరోనా పాజిటివ్గా తేలడంతో.. లంక ప్లేయర్స్ ఐసోలేషన్కి వెళ్లిన విషయం తెలిసిందే.
ఇటీవలే ఇంగ్లండ్ పర్యటనను శ్రీలంక ముగించుకుంది. లంక ప్లేయర్స్ స్వదేశానికి రాకముందే ఇంగ్లండ్ జట్టులో ఏడు కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో ముగ్గురు ప్లేయర్స్ ఉండగా.. నలుగురు సహాయ సిబ్బంది ఉన్నారు. దాంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కొలంబోకి వచ్చే ముందే శ్రీలంక టీమ్కి కరోనా పరీక్షలు చేయించారు. అప్పుడు ఎవరికీ పాజిటివ్ రాలేదు. దాంతో ప్లేయర్స్ అందరూ కలిసే ఉన్నారు.
ఇంగ్లండ్ నుంచి శ్రీలంక ఆటగాళ్లు మంగళవారం సాయంత్రం కొలంబో చేరుకున్నారు. కొలంబోలో అడుగుపెట్టిన శ్రీలంక టీమ్కి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా.. ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్కి పాజిటివ్గా తేలింది. దాంతో అతడ్ని వెంటనే ఐసోలేషన్కి పంపిన శ్రీలంక క్రికెట్ బోర్డు.. ఆటగాళ్లను కూడా క్వారంటైన్కి తరలించింది. ఇంగ్లండ్ నుంచి గ్రాంట్ ఫ్లవర్ వచ్చిన విమానంలోనే శ్రీలంక క్రికెటర్లు రావడంతో.. నాలుగు రోజుల్లో టీమిండియాతో ప్రారంభం కానున్న వన్డే సిరీస్పై అనుమానాలు నెలకొన్నాయి. అయితే తాజాగా నిర్వహించిన కరోనా టెస్టుల్లో శ్రీలంక క్రికెటర్లందరికి నెగటివ్ అని తేలింది. దీంతో లంక బోర్డు ఊపిరిపీల్చుకుంది.
గత నెల చివర్లోనే శ్రీలంకకి చేరుకున్న శిఖర్ ధావన్ కెప్టెన్సీలోని భారత్ జట్టు ప్రస్తుతం ప్రాక్టీస్ మ్యాచులు ఆడుతోంది. రెండో ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్లు సత్తాచాటారు. గురువారం మొదలైన ఈ మ్యాచ్లో మొదటగా టీమిండియా స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ (3 వికెట్లు), యజ్వేంద్ర చహల్ (2 వికెట్లు) చెలరేగగా.. శుక్రవారం భారత బ్యాట్స్మెన్లు బౌండరీలు, సిక్సర్లతో చెలరేగిపోయారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా, పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్, నితీష్ రాణాలు ఆకాశమే హద్దుగా ఆడారు. దీనికి సంబంధించిన వీడియోను శ్రీలంక క్రికెట్ యూట్యూబ్ ఛానల్లో షేర్ చేసింది.