
హైదరాబాద్: ఫామ్లేమితో ఇబ్బందిపడుతున్న కెప్టెన్ దినేశ్ చండిమాల్కు శ్రీలంక క్రికెట్ బోర్డు షాకిచ్చింది. ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్ వరకు శ్రీలంక కెప్టెన్గా వ్యవహరించిన చండిమాల్ ఇప్పుడు ఏకంగా జట్టులోనే చోటు కోల్పోయాడు. దక్షిణాఫ్రికాలో పర్యటించే శ్రీలంక టెస్టు జట్టులో అతడికి స్థానం దక్కలేదు. దక్షిణాఫ్రికా గడ్డపై జరిగే రెండు టెస్టుల సిరీస్లో పాల్గొనే లంక జట్టులో 17 మందితో కూడిన జట్టులో చండిమాల్ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేయలేదు.
ఆస్ట్రేలియా చేతిలో శ్రీలంక ఓడిన రెండు టెస్టుల్లో చండీమాల్ వరుసగా 5, 0, 15, 4 పరుగులు చేశాడు. దేశవాళీ టోర్నీ ల్లో ఆడి ఫామ్ను సంతరించుకోవాలని సెలెక్టర్లు చండిమల్కు సూచించారు. చండిమాల్ 17 టెస్టుల్లో లంకకు సారథ్యం వహించాడు. సఫారీ పర్యటనకు చండీమాల్ స్థానంలో దిముత్ కరుణరత్నే కెప్టెన్గా వ్యవహరిస్తాడు.
ఆఫ్స్పిన్నర్ దిల్రువాన్ పెరీరా, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ రోషన్ సిల్వా కూడా ఉద్వాసనకు గురయ్యారు. వీరిస్థానంలో నలుగురు కొత్త ఆటగాళ్లకు సెలక్టర్లు చోటు కల్పించారు. బ్యాట్స్మెన్లు ఏంజెలో పెరీరా, ఒషాడా ఫెర్నాండోలతో పాటు లెఫ్టార్మ్ స్పిన్నర్ లసిత్ ఎంబుల్డెనియా, పేస్ బౌలర్ మొహమ్మద్ షిరాజ్లకు తొలిసారి అవకాశం లభించింది.
సఫారీ పర్యటనలో భాగంగా శ్రీలంక జట్టు రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్ ఆడనుంది. ఈ సిరీస్లో భాగంగా ఫిబ్రవరి 13 నుంచి డర్బన్లో తొలి టెస్టు జరుగుతుంది.