మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక అరంగేట్ర ప్లేయర్ మిలన్ రత్నాయకె చరిత్ర సృష్టించాడు. భారత మాజీ క్రికెటర్, 1983 వరల్డ్ కప్ విజేత బల్విందర్ సంధు పేరిట ఉన్న 41 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టి తన పేరిట లిఖించుకున్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక మొదటి ఇన్నింగ్స్లో 236 పరుగులకు ఆలౌటైంది.
ఇంగ్లండ్ బౌలర్లు విజృంభించడంతో లంక ఆరు పరుగులకే కీలక మూడు వికెట్లు కోల్పోయింది. ఇంగ్లిష్ బౌలర్లు అదే జోరు కొనసాగించడంతో 113 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. కానీ ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన కెప్టెన్ ధనంజయ డిసిల్వా (74; 84 బంతుల్లో, 8 ఫోర్లు), మిలన్ రత్నాయకె (72; 135 బంతుల్లో, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) ఇన్నింగ్స్ చక్కదిద్దారు.

వీరిద్దరు అర్ధశతకాలు సాధించి లంకకు మెరుగైన స్కోరు అందించారు. అయితే తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన మిలన్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో ఓ ఇన్నింగ్స్లో తొమ్మిదో స్థానంలో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్గా 28 ఏళ్ల మిలన్ చరిత్రకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు బల్విందర్ పేరిట ఉంది. 1983లో హైదరాబాద్ వేదికగా పాకిస్థాన్తో జరిగిన టెస్టులో బల్విందర్ తొమ్మిదో స్థానంలో వచ్చి 71 పరుగులు సాధించి రికార్డు నెలకొల్పాడు. 41 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ రికార్డు బద్దలైంది.
కాగా, మిలన్ రత్నాయకెకు ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. గస్ అట్కిన్సన్ రెండు వికెట్లు తీశాడు. అనంతరం ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ తొలి రోజు ఆట ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. బెన్ డకెట్ (13*), డానిల్ లారెన్స్ (9*) క్రీజులో ఉన్నారు. ఇంగ్లిష్ జట్టు ఇంకా 214 పరుగుల వెనుకంజలో ఉంది. ఇటీవల భారత్పై వన్డే సిరీస్ను గెలిచిన శ్రీలంక.. మూడు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది.