హైదరాబాద్: వరుస ఓటములతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న శ్రీలంక జట్టుపై అభిమానులు సీరియస్ అయ్యారు. ఐదు వన్డేల సిరిస్లో భాగంగా దంబుల్లా వేదికగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా 9 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
దీంతో పాటు 200పైచిలుకు లక్ష్యాన్ని అతి తక్కువ బంతుల్లో ఛేజ్ చేసి భారత్ రికార్డు విజయాన్ని సొంతం చేసుకుంది. వన్డే సిరీస్కి ముందు ఆతిథ్య జట్టుతో ఆడిన మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. ఇలా ఆతిథ్య జట్టు వరుస ఓటములను చవిచూడటంతో లంక అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

మ్యాచ్ అనంతరం అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం శ్రీలంక ఆటగాళ్లు తమకు కేటాయించిన బస్సుల ద్వారా హోటల్కి బయల్దేరేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో సుమారు 50 మంది అభిమానులు ప్లేయర్స్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, వాళ్లను హేళన చేస్తూ బస్సును వెళ్లకుండా అడ్డుకున్నారు.
వెంటనే పోలీసులు వచ్చి ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించి వేశారు. దీంతో సుమారు 30నిమిషాల ఆలస్యంగా ఆటగాళ్లు మైదానం నుంచి హోటల్కి బయల్దేరారు. టెస్టు సిరిస్ను 3-0తో ఓడినప్పటికీ, తొలి వన్డే చూడటానికి భారీగా తరలివచ్చారు. తొలి వన్డేలో కూడా శ్రీలంక ఘోర ఓటమిని చవిచూడటంతో అభిమానులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.
లండన్ వేదికగా ముగిసిన ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీలో లీగ్ దశలోనే నిష్క్రమించడం, అనంతరం వన్డే సిరీస్లో జింబాబ్వే చేతిలో ఓడిపోవడం ఇవన్నీ శ్రీలంక అభిమానులకు తీవ్ర నిరాశ కలిగిస్తోంది. మరోవైపు ఇప్పటికే శ్రీలంక ఆటగాళ్లపై ఆ దేశ క్రీడల మంత్రి, పలువురు మాజీ క్రికెటర్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇక శ్రీలంక జట్టు కోచ్ నిక్ పోథాస్ కూడా అసంతృప్తిగానే ఉన్నాడు. జట్టుపై బయటి వ్యక్తుల పెత్తనం ఎక్కువైందని, తనకు పూర్తి స్వేచ్ఛనిస్తే జట్టుని మళ్లీ గాడిలో పెట్టగలనని స్పష్టంచేశాడు. శ్రీలంక ప్రభుత్వంతోపాటు సెలక్టర్లు కూడా జట్టు వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని పోథాస్ తప్పుబట్టాడు.
ప్రస్తుతం కరేబియన్ ప్రీమియర్ లీగ్లో ఆడుతోన్న శ్రీలంక మాజీ క్రికెటర్ సంగక్కర మాత్రం అభిమానులు శాంతించాలని కోరాడు. 'జట్టు తడబడుతున్న సమయంలో మీ ప్రేమ, అభిమానాలే మాకు కొండంత అండగా నిలుస్తాయి. ప్రస్తుతం జట్టుకు మీ నుంచి అదే కావాలి. జట్టు మళ్లీ గాడిలో పడుతుందన్న విశ్వాసంతో వాళ్లకు మద్దతుగా నిలుద్దాం' అని అభిమానులకు సంగక్కర పిలుపునిచ్చాడు.