
కాంట్రాక్ట్ వివాదం:
శ్రీలంక క్రికెట్ బోర్డు, ఆ దేశ ఆటగాళ్ల మధ్య సెంట్రల్ కాంట్రాక్ట్కి సంబంధించి గత కొన్నిరోజులుగా వివాదం నడుస్తోంది. ఇటీవల కొన్ని విదేశీ పర్యటనల ముందు కూడా ఆటగాళ్లు కాంట్రాక్ట్ విషయమై బోర్డుపై అసహనం వ్యక్తం చేశారు. అయినా ఎస్ఎల్సీ మాత్రం నిమ్మకునీరెత్తినట్టే ఉంది. దీంతో భారత్తో సిరీస్కి ముందు కాంట్రాక్ట్పై సంతకం చేసేందుకు లంక క్రికెటర్లు విశ్వ ఫెర్నాండో, లాహిరు కుమార, అషేన్ బండార, కసున్ రజిత, లసిత్ ఎంబుల్దెనియా నిరాకరించారు. నేషనల్ కాంట్రాక్ట్ నిమిత్తం మొత్తం 24 మంది క్రికెటర్లకి ఎస్ఎల్సీ ఆఫర్ చేయగా.. ఈ ఐదుగురు మాత్రం తాము సంతకం చేయమని బోర్డుకు స్పష్టం చేశారు.

జూలై 8 డెడ్లైన్:
ఇంగ్లండ్ పర్యటనలో ఉండగానే కాంట్రాక్ట్కి సంబంధించి పత్రాలు ఆటగాళ్లకు పంపగా.. కీలక ఐదుగురు ప్లేయర్స్ మాత్రం సంతకం చేసేందుకు నిరాకరించారు. జూలై 13 నుంచి టీమిండియాతో సిరీస్ ఆరంభంకానున్న నేపథ్యంలో ఎస్ఎల్సీ తమ ఆటగాళ్లను హెచ్చరించింది. జాతీయ ఒప్పందాలపై సంతకం చేయడానికి జూలై 8 వరకు గడువు ఇచ్చింది. గడువులోగా లంక క్రికెటర్లు కాంట్రాక్ట్ ఒప్పందాలపై సంతకం చేయకుంటే.. టీమిండియాతో జరిగితే సిరీస్లకు ఎంపికచేయమని స్పష్టం చేసింది. మరి ఆ ఐదుగురు ఆటగాళ్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

బబుల్ నిబంధనల్ని అతిక్రమించి:
ఇటీవలి కాలంలో లంక జట్టు వరుస పరాజయాలను ఎదుర్కొంటోంది. ఇంగ్లండ్ టూర్లో వన్డే, టీ20 సిరీస్లను కోల్పోయింది. ఒక్క మ్యాచులో కూడా కనీస పోటీ ఇవ్వలేకపోయింది. ఇది చాలదన్నట్టు ఇంగ్లండ్ టూర్లో బయో బబుల్ నిబంధనల్ని అతిక్రమించిన కుశాల్, గుణతిలక, డిక్లెల్వా సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురు దూరమవడంతో ఇప్పటికే బలహీనపడిన శ్రీలంక.. ఆ ఐదుగురు క్రికెటర్లు కూడా సిరీస్కి దూరమైతే లంకకు భారీ ఎదురుదెబ్బ తగలనుంది.

జూలై 13 సిరీస్ ఆరంభం:
భారత్, శ్రీలంక జట్ల మధ్య జూలై 13, 16, 19 తేదీల్లో వరుసగా మూడు వన్డేలు జరగనుండగా.. జూలై 22, 24, 27 తేదీల్లో మూడు టీ20ల సిరీస్ జరగనుంది. కఠిన బయో బబుల్ నేపథ్యంలో ఈ సిరీస్లు ప్రేక్షకుల్లేకుండానే జరగనున్నాయి. 2018 నిదహాస్ తర్వాత భారత్ తొలిసారి శ్రీలంకలో పర్యటిస్తుండటంతో.. ఆ దేశ క్రికెట్ బోర్డు ఈ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో అన్ని మ్యాచులు జరుగుతాయి. వన్డేలు మధ్యాహ్నం 1:30 గంటలు, టీ20లు రాత్రి 7 గంటలకు మొదలవుతాయి.


Click it and Unblock the Notifications












