హైదరాబాద్: పాకిస్థాన్లో పర్యటించేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు అంగీకరించింది. గత ఎనిమిదేళ్లుగా పాకిస్థాన్లో క్రికెట్ మ్యాచ్లు ఆడించేందుకు ఆ దేశ బోర్డు చేసిన ప్రయత్నాలు ఇప్పటికి సఫలమయ్యాయి. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డు ఛీప్ తిలంగా సుమితపాలా ఓ ప్రకటన విడుదల చేశారు.
మూడు టీ20ల సిరిస్లో భాగంగా ఈ సెప్టెంబర్లో పాకిస్థాన్లో శ్రీలంక జట్టు పర్యటించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా కనీసం ఒక టీ20 మ్యాచ్ లాహోర్ వేదికగా జరిగే అవకాశం ఉందని అన్నారు. తమకు భద్రతపై పూర్తి హామీ వచ్చిన తర్వాతనే పాక్ పర్యటనకు ఓకే చెప్పినట్లు ఆయన తెలిపారు.

2009లో లాహోర్లో శ్రీలంక జట్టు బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఉగ్రవాది జరిగిన నేపథ్యంలో పాక్లో అడుగుపెట్టేందుకు ఏ జట్టూ సాహసం చేయడం లేదు. ఈ ఉగ్రదాడిలో మొత్తం ఎనిమిది చనిపోగా, శ్రీలంక జట్టులోని కొందరు ఆటగాళ్లు తీవ్ర గాయాలు పాలయ్యారు.
గత ఎనిమిదేళ్లుగా పీసీబీ తటస్థ వేదిక అయిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో పాకిస్థాన్ తన మ్యాచ్లను నిర్వహిస్తోంది. దీంతో పీసీబీకి వచ్చే ఆదాయంలో భారీ కోత పడుతోంది. ఈ నేపథ్యంలో ఒక్క జట్టునైనా తమ దేశంలో ఆడించాలని గత కొన్నాళ్లుగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చేస్తున్న ప్రయత్నాలు సఫలమయ్యాయి.
శ్రీలంక క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్థాన్ క్రికెట్ వర్గాలు స్వాగతించాయి. 'ధన్యవాదాలు తిలంగా సుమితపాలా. శ్రీలంక జట్టుకు ఆతిథ్యమిచ్చేందుకు ఎదురు చూస్తున్నాం' అని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.
ఇదిలా ఉంటే 2009 ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్లో పర్యటించిన ఏకైక జట్టుగా జింబాబ్వే నిలిచింది. 2015లో పాకిస్థాన్తో జింబాబ్వే ఐదు వన్డే మ్యాచ్లు ఆడింది.