
శ్రీలంక రాజధాని కొలంబోలో ఈస్టర్ ప్రార్థనల తరుణంలో ఆదివారం ఉదయం మూడు చర్చిలు, మూడు హోటళ్లలో పేలుళ్లు జరిగాయి. మొత్తం ఎనిమిది చోట్ల జరిగిన పేలుళ్లలో 200 మందికి పైగా మరణించగా.. 400 మందికి గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు. శ్రీలంకలో జరిగిన ఈ దారుణ ఘటనలను యావత్ క్రీడా ప్రపంచం ఖండించింది. దిగ్గజ ఆటగాళ్లతో సహా ప్రస్తుత ఆటగాళ్లు కూడా సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం తెలిపారు.
మహేలా జయవర్ధనే: 'మాకిది చాలా బాధాకరమైన రోజు. 10 సంవత్సరాల పాటు శాంతియుతంగా ఉన్న దేశంలో మరోసారి దాడులు జరిగాయి. ప్రాణాలు కోల్పోయిన వారికి నా సానుభూతి. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను'.
శిఖర్ ధావన్: 'గుండె పగిలినంత బాధగా ఉంది. ఇలాంటి ఘటనలు జరగడం దారుణం. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి'.
విరాట్ కోహ్లీ: 'శ్రీలంకలో పేలుళ్ల ఘటన జరిగిందనే వార్త విని షాకయ్యాను. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి నా సంతాపం. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలి ప్రార్థిస్తున్నా'.
సచిన్: 'లంకలో దాడులు జరిగాయని తెలిసి ఎంతో బాధపడ్డా. ఈ తీవ్రవాద ఘటనలను ఖండించాలి. ప్రేమ, దయ మరియు కరుణను హింసాత్మక ఘటనలు జయించలేవు'.
సానియా మీర్జా: 'ప్రపంచ వ్యాప్తంగా ఏం జరుగుతోంది. దేవుడు అందర్నీ కాపాడాలి'.
వీవీఎస్ లక్ష్మణ్: 'శ్రీలంకలో దాడి తెలిసి చాలా బాధ పడ్డా. శ్రీలంక దేశ ప్రజలకు నా ప్రగాఢ సానుభూతి. పేలుళ్లలో గాయపడిన వాళ్లందరూ త్వరగా కోలుకోవాలి'.