
హైదరాబాద్: టెస్టు క్రికెట్లో శ్రీలంక జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. పోర్ట్ ఎలిజబెత్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్ను 2-0తో శ్రీలంక కైవసం చేసుకుంది. దీంతో దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ గెలిచిన ఏకైక ఆసియా జట్టుగా శ్రీలంక అరుదైన ఘనత సాధించింది.
దక్షిణాఫ్రికా నిర్దేశించిన 197 పరుగల విజయ లక్ష్యాన్ని శ్రీలంక 2 వికెట్లు కోల్పోయి ఛేదించారు. ఒషాడో ఫెర్నాండ్(75 నాటౌట్), కుశాల్ మెండిస్(84 నాటౌట్)లు శ్రీలంక చిరస్మరణీయ విజయంలో ముఖ్య భూమిక పోషించారు. ఓవర్నైట్ స్కోరు 60/2తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక వికెట్ చేజార్చుకోకుండా లక్ష్యాన్ని ఛేదించింది.
వీరిద్దరూ 163 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. నాలుగో ఇన్నింగ్స్లో శ్రీలంకకు ఇది మూడో అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం. అంతకముందు డర్బన్లో జరిగిన తొలి టెస్టులో శ్రీలంక ఒక వికెట్ తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ సిరిస్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును మెండీస్ సొంతం చేసుకోగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ను కుశాల్ పెరీరా అందుకున్నాడు.
స్కోరు వివరాలు:
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 154 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 197/2
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 222 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 128 ఆలౌట్