
కొలంబో: శ్రీలంక స్టార్ ఆల్రౌండర్ తిసారా పెరీరా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అవుతున్నట్లు సోమవారం ప్రకటించాడు. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ)కు సోమవారం ఉదయం తెలియజేశాడు. గురువారం లంక సెలక్టర్లు సమావేశం కానుండగా ఈలోపే తిసారా తన నిర్ణయాన్ని తెలిపాడు. అయితే తాను ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడటాన్ని కొనసాగిస్తానని పేర్కొన్నాడు. పెరీరా 32 ఏళ్లకే ఆటకు ఆల్విదా పలికి అందరిని ఆశ్చర్యపరిచాడు.
శ్రీలంక తరఫున తిసారా పెరీరా 6 టెస్టులు, 166 వన్డేలు, 84 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. 6 టెస్టుల్లో 203 పరుగులు చేసి 11 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో అంతగా రాణించని పెరీరా.. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో మాత్రం తనదైన ముద్ర వేశాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్మన్ అయిన పెరీరా 166 వన్డేలలో 2338 పరుగులు చేశాడు. 175 వికెట్లు కూడా తీశాడు. ఇక టీ20 ఫార్మాట్లో 1204 పరుగులు, 51 వికెట్లు పడగొట్టాడు. లంక జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. 2011 ప్రపంచకప్ ఫైనల్లో కూడా మెరుపు బ్యాటింగ్ చేశాడు.
పురుషుల వన్డే క్రికెట్లో కనీసం 2000 పరుగులు చేసిన బ్యాట్స్మెన్లలో తిసారా పెరీరా స్ట్రైక్రేట్ 112 కావడం విశేషం. పరిమిత ఓవర్ల క్రికెట్లో శ్రీలంక అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడిగా పెరీరా గుర్తింపుతెచ్చుకున్నాడు. టీమిండియాతో జరిగిన 2011 ప్రపంచకప్ ఫైనల్లో కూడా మెరుపు బ్యాటింగ్ చేశాడు. 2014లో శ్రీలంక టీ20 ప్రపంచకప్ విజేత జట్టులో పెరీరా కూడా కీలక పాత్ర పోషించాడు.
తిసారా పెరీరా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోనూ 37 మ్యాచ్లు ఆడాడు. 37 మ్యాచుల్లో 422 పరుగులు, 31 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్, కొచ్చి టస్కర్స్ కేరళ మరియు రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ జట్ల తరఫున ఆడాడు. ఆ తర్వాత ఫామ్ కోల్పోవడంతో మళ్లీ ఆడలేదు. ప్రస్తుతం లంక ప్రీమియర్ లీగ్లో జాఫ్నా స్టాలియన్స్ తరఫున పెరీరా ఆడుతున్నాడు.