ఐపీఎల్ 16వ సీజన్ను సన్రైజర్స్ హైదరాబాద్ ఘోరమైన ఓటమితో మొదలు పెట్టింది. రాజస్థాన్ రాయల్స్తో సొంత మైదానంలో ఆడిన మ్యాచులో సన్రైజర్స్ చిత్తయింది. కొత్త కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ గైర్హాజరీలో భువనేశ్వర్ కుమార్ ఈ జట్టుకు సారధ్యం వహించాడు. అతని కెప్టెన్సీ లోపాలు చాలా స్పష్టంగా కనిపించాయి. సరైన ఫీల్డింగ్ సెటప్ పెట్టలేకపోయిన భువీ.. రాజస్థాన్ బ్యాటర్లకు సులభంగా పరుగులు చేసే అవకాశం కల్పించాడు.
బలమైన బౌలింగ్ ఉన్నా కూడా సన్రైజర్స్ బౌలర్లు ఏమాత్రం ఆకట్టుకోలేదు. దీంతో రాజస్థాన్ ఏకంగా 203 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేజింగ్లో సన్రైజర్స్ బ్యాటర్లు ఎవరూ రాణించలేదు. మినీ వేలంలో రూ.13 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన హ్యారీ బ్రూక్ కేవలం 13 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. దీంతో ఈ మ్యాచ్లో 72 పరుగుల తేడాతో సన్రైజర్స్ ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఉమ్రాన్ మాలిక్ తీసిన ఏకైక వికెట్ మాత్రం అభిమానులను అలరించింది.15వ ఓవర్లో దేవదత్ పడిక్కల్ బ్యాటింగ్ చేస్తుండగా ఉమ్రాన్ మాలిక్ బంతి అందుకున్నాడు.

ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు మాట్లాడిన ఉమ్రాన్.. గతేడాది కాలంలో చాలా నేర్చుకున్నానని, తన బౌలింగ్ చాలా మెరుగైందని చెప్పాడు. 'ఆడేందుకు నేను చాలా ఎగ్జయిటింగ్గా ఎదురు చూస్తున్నా. బాగా ఆడేందుకు ప్రయత్నిస్తా. ఆడిన ప్రతి మ్యాచులో ప్రభావం చూపించడానికి ట్రై చేస్తా. జట్టు కోసం బాగా ఆడాలనే నా కోరిక. అంతర్జాతీయంగా ఆడిన అనుభవం చాలా నేర్పింది. ఇది కచ్చితంగా నా ఆటతీరును మారుస్తుందని అనుకుంటున్నా' అని చెప్పుకొచ్చాడు. రాజస్థాన్ మ్యాచ్లో మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన ఉమ్రాన్.. 32 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు.