ప్లేఆఫ్స్ చేరాలంటే ఆర్సీబీ తప్పక గెలవాల్సిన మ్యాచ్. అవతలి టీంలో భారీ సెంచరీ. అలాంటి మ్యాచ్లో జట్టు ఎవరిపై ఆధారపడాలి? అంటే ఇంకెవరిపై? ఛేజ్ మాస్టర్ కోహ్లీపైనే. సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ తన స్పెషాల్టీ ఏంటో మరోసారి చూపించాడు. 187 పరుగుల ఛేజ్ను వరుస బౌండరీలతో మొదలు పెట్టిన అతను.. సెంచరీతో హైదరాబాద్ ప్రేక్షకులను అలరించాడు.
ఈ మ్యాచ్లో సన్రైజర్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఆ టీం స్టార్ బ్యాటర్ హెన్రిక్ క్లాసెన్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 51 బంతుల్లోనే 104 పరుగులు చేశాడు. అయితే అతనికి మిగతా బ్యాటర్ల నుంచి సరైన సహకారం లభించలేదు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 186 పరుగుల మంచి స్కోరు చేసింది. ఛేజింగ్ కోసం క్రీజులోకి వచ్చీ రావడంతోనే తన మూడో ఏంటో కోహ్లీ చెప్పేశాడు.

భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్ మొదటి రెండు బంతులను బౌండరీలు బాదాడు. గత సీజన్లో సన్రైజర్స్తో ఆడిన రెండు మ్యాచుల్లో కోహ్లీ గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరిన సంగతి తెలిసిందే. అసలు తనకు అది గుర్తే లేనట్లు సన్రైజర్స్ బౌలర్లపై ఎదురుదాడి చేశాడీ స్టార్ బ్యాటర్. దీంతో ఏ దశలోనూ సన్రైజర్స్కు గెలిచే అవకాశం కనిపించలేదు.
ఈ క్రమంలోనే 61 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ.. ఆ మరుసటి బంతికే పుల్ షాట్ ఆడబోయి గ్లెన్ ఫిలిప్స్కు చిక్కాడు. ఆ తర్వాత కాసేపటికే ఫాఫ్ డుప్లెసిస్ (71) కూడా పెవిలియన్ చేరాడు. అప్పటికి బంతికి ఒక పరుగు చేస్తే ఆర్సీబీ గెలిచే పరిస్థితి నెలకొంది. ఈ ఛేజ్ను మ్యాక్స్వెల్ (5 నాటౌట్), బ్రేస్వెల్ (4 నాటౌట్) సులభంగా పూర్తిచేశారు.
దీంతో ఆర్సీబీ 19.2 ఓవర్లలో 8 వికెట్లు మిగిలుండగానే విజయం సాధించింది. ఈ విజయంతో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ఆర్సీబీ నాలుగో స్థానానికి చేరుకుంది. ముంబై ఇండియన్స్, ఆర్సీబీ రెండు జట్లు 14 పాయింట్లతోనే ఉండగా.. నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉన్న కారణంగా ఆర్సీబీ నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది.