క్రికెట్లో నెంబర్ 18 అనగానే అందరికీ చటుక్కున గుర్తొచ్చేది విరాట్ కోహ్లీ. అతనికి, ఆ నెంబర్కు విడదీయరాని బంధం ఉంది. ఇదే విషయాన్ని కోహ్లీ కూడా చెప్పాడు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అతను ఈ నెంబర్ తనకు ఎలా వచ్చింది? ఆ తర్వాత ఎలా తనకు ఆ సంఖ్యతో విడదీయరాని బంధం ఏర్పడిందీ వివరించాడు.
'నిజానికి నా కెరీర్ ఆరంభంలో 18 ఒక నెంబర్ మాత్రమే. అండర్-19 జెర్సీ ఓపెన్ చేసినప్పుడు నాకు ఇచ్చిన నెంబర్ అదే. నా పేరు మీద ఒక నెంబర్ ఇచ్చింది అప్పుడే. ఆ సమయంలో నాకు ఇచ్చిన నెంబర్ 18. దాని కోసం నేను ఎప్పుడూ అడగలేదు. నాకు ఆ నెంబర్ ఇచ్చారు అంతే. కానీ ఆ తర్వాత నా జీవితంలో అది చాలా ముఖ్యమైన నెంబర్గా మారింది' అని కోహ్లీ చెప్పాడు.

'నేను టీమిండియా తరఫున మొదటి మ్యాచ్ ఆడింది ఆగస్టు 18న. అలాగే మా నాన్న చనిపోయింది డిసెంబర్ 18న. ఇలా నా జీవితంలో రెండు ముఖ్యమైన ఘటనలు జరిగిన తేదీ 18 కావడం ఇప్పటికీ ఆశ్చర్యకరంగానే ఉంటుంది. అయితే ఈ ఘటనలు జరగడానికి ముందే నాకు ఈ నెంబర్ జెర్సీ ఇచ్చారు. అందుకే ఈ నెంబర్కు, నాకు ఏదో రాసి పెట్టి ఉందని నమ్ముతా' అన్నాడు.
'మ్యాచ్ ఆడేందుకు వెళ్లినప్పుడు.. చాలా మంది నా జెర్సీ నంబర్ వేసుకొని, దాంతోపాటు నా పేరు కూడా ఉన్న జెర్సీలతో కనిపిస్తారు. నేను ఇలాంటి పొజిషన్లో ఉంటానని ఎప్పుడూ ఊహించలేదు' అని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున కోహ్లీ చక్కగా రాణిస్తున్నాడు. ఈ టీం ఆడిన 12 మ్యాచుల్లో ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది.
ఈ సీజన్ ఆరంభం నుంచి కోహ్లీ మంచి ఫామ్లో కనిపించాడు. తను ఆడిన 12 మ్యాచుల్లో 438 పరుగులు చేశాడు. ఈ ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు. మిగిలిన రెండు మ్యాచుల్లో కూడా మంచి ప్రదర్శన చేసి, జట్టును ప్లేఆఫ్స్ తీసుకెళ్తాడని ఫ్యాన్స్ ఆశిస్తన్నారు. మరి కోహ్లీ ఎలా ఆఢతాడో చూడాలి.